About the Page

2000 సంవత్సరములోకి ప్రవేశించేందుకు ముందు 1999 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ అను అంశముపై మాస్టర్ ఆర్.కె. అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపంద ఈ ప్రవచనములు. ఆధ్యాత్మికతలోకి ప్రవేశించదలుకున్నవారు తప్పక వినవలెను.

1.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్ నెస్ అనే ఈ ప్రవచనము ప్రతి అధ్యాత్మిక మార్గ ప్రవేశం చేసిన, చెయ్యదలచిన, చేస్తున్న వ్యక్తి తప్పనిసరిగా దీనిని పదే పదే విని, నోట్స్ రాస్కుని పాటించలవసిన అతి ముఖ్య విషయములను ఈ ప్రవచనంలో అందించారు. " గురువుల యొక్క చేతనత్వస్థాయిల" వివరణ ఇంతవరకూ ఎవ్వరూ ఇంత అద్భుతంగా వివరించలేదు. గురుచేతనత్వంలోని డిగ్రాలను వివరించారు. శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురు దేవులు కాశీలో ఉండగా తనకు 33 మంది గురువులు ఉండేవారని చెప్తుండేవారు. ఇప్పటివరకూ ఎప్పుడూ ఎవ్వరూ వినని, అందరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన రహస్యాలను ఈ ప్రవచనంలో వివరించారు.

2.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మనం ఏ రోజు ఈ విషయాన్ని వింటామో ఆ రొజు మనకి ఆ చేతనత్వస్థాయిని అందుకునే సదవకాశం లభించింది అని మర్చిపోకూడదు. వేదవిజ్ఞానం అర్ధం కావాలి అంటే త్రికాల సంధ్యావందనం తప్పక చేసుకోవాలి. 2000 సంవత్సరం దాటాక వచ్చే మార్పులకు, దేవ మానవులుగా మారటానికి కావలసిన జ్ఞానం అందించారు. గురువులు మొత్తం 33 డిగ్రీలలోనే ఉంటారు, వేదాలు అగ్ని సూక్తంతో మొదలు అవుతాయి. అష్టవశువుల జ్ఞానము పొందాలి. వాక్కు యొక్క దురుపయోగం జరగకూడదు, మలినమైన నోరు వాక్శక్తిని ఉత్పాదన చెయ్యలేదు. అగ్ని విద్యలోని పదమును పాదార్ధముగా మార్చే శక్తి రావాటానికి ఈ నియమం తప్పనిసరి, 2000 తరువాత వాక్శక్తికి అధిక ప్రాముఖ్యత ఉన్నది. గురువులు మన ప్రతి కోరికను తీర్చరు, అది జరగకపోవటం మన క్షేమం కోసమే అని గుర్తుపెట్టుకోవాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధాన పధ్ధతి వివరణను అందించారు.

3.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురువులందరూ 14వ మన్వంతరానికి చెందినవారు. (మనుషులు వైవస్వత మన్వంతరంలో ఉన్నారు, గురువులు ఇంద్ర సావర్ణి మన్వంతరానికి చెందినవారు.) 2000 సంవత్సరంలోపు ఇచ్చిన ఈ జ్ఞానం కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా ఘనీభవించిన చేతనత్వం. నాలుగింటి చేతనత్వాలు మీకు తెలియాలి. గురుచేతనత్వంలో ఉపయోగపడే నాలుగు స్థాయిలు, నాలువు విశేషమైన మానసిక స్ధితులు. అవి. 1. గుర్రము - షిరిడీ సాయి జీవిత చరిత్రలో దాని ప్రాధాన్యత మనకు అర్ధం అవుతుంది, దానిపేరు శ్యాం సుందర్. గురువుల జీవిత చరిత్రలో గుర్రము పాత్ర తెలుసుకోండి. గుర్రం శక్తికి ప్రతీక ( హార్స్ పవర్). 2, ఆవు, 3. కుక్క, 4. ఏనుగు. ఏ గురువు దగ్గర ఏ ప్రాణి ఉందో దానిని బట్టి ఆ గురువు ఏ చేతనత్వాన్ని వాడుతున్నారో తెలుస్తుంది, వర్ణాశ్రమ వ్యవస్థ అర్ధం అవుతుంది. గురుతత్వముతో ఋణానుబంధం పెంచుకోవాలి అంటే వారి రూపమును నిరంతరం దర్శించాలి. కుటుంబములోని అందరూ ఈ అలవాటుని చేస్కుంటే మరింత మంచిది, దీనికి వీలుగా ఇంటీలోకి ప్రవేశించగానే గురువు ఫొటోలు అందరికీ కనపడేలా పెట్టుకోవాలి. మదర్ మిర్రా ప్రతిరాత్రి చేసే సాధనను కూడా వివరించారు.

4.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మీ శరీరము ద్వారా ఒక చేతనత్వము తనని తాను అభివ్యక్తీకరించుకుంటోంది, దానినే సూర్యుడు అంటాం. తనంతట తాను అంత: చేతనద్వారా వికశిస్తాడు. సూర్యుడి ద్వారా ఈ జగత్తు అంతా గతిమానమై ఉన్నది. మౌనంలోకి వెళ్ళాలి, మౌనం,శూన్యంలోకి ప్రవేశించటం, సమర్పణలోకి ప్రవేశించటం ఒకటే, ఇది మొదలయితేనే సాధన మొదలయినట్లు. ఒక కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ని బట్టి దానిని ఉపయోగించి ఏదో ఒక పనిని చెయ్యగలవు, అలానే శూన్యంలోకి ప్రవేశిస్తేనే మీరు ఎమన్నా ఉపయోగపడగలుగుతారు. అది లేనంతసేపు - ఆహార నిద్రా భయ మైధునంచ అని మనిషి జంతు స్థాయిలోనే ఉంటాడు. అంత:చేతన వికశింపచేసుకోవాలి. మనలోని మాలిన్యాలను పోగొట్టుకోవడానికి సాధన చాలా అవసరం. అసూయారహిత స్ధితికి వెళ్తేకానే మీరు ఎదగలేరు.

5.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మనం ఉన్న నేటి సమాజం అధ్యాత్మిక జీవిత విధానానికి పూర్తిగా విరుధ్ధంగా ఉంది. గురువు వద్దకు వెళ్ళటానికి మొదటిమెట్టు "అహంకార రాహిత్యము". అధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి మీకు ఒక మార్గదర్శకుడు కావాలి, అది గురువుల చరిత్రల ద్వారా కూడా పొందవచ్చు. ఇ ఇ జీ ద్వారా మీరు ధ్యాన స్ధితిలోకి వెళ్ళారో లేదో తెలుసుకోవచ్చు.అందువల్ల ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఇదివరకు 12 ఏళ్ళకి కానీ సాధించలేని అధ్యాత్మిక స్ధితిని 2,3 నెలలలో సాధించవచ్చు. నిజమైన గురువు సమక్షంలో కూర్చుంటే మీ మనస్సు పనిచెయ్యదు, అలాంటి సమక్షాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఏ కోరికా లేకుండా ఏ సంకల్పం లేకుండా జరుగుతున్న దానికి రి-యాక్ట్ అవ్వండి, యాక్ట్ కావద్దు. ఒక్కొక్క ఆవు 1000 మాగ్నిఫయింగ్ లెన్స్ వలె పనిచేస్తాయి, ఆవుల సమక్షంలో సాధన అద్భుత ఫలితాల్ని ఇస్తుంది.

6.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వములోని వివిధ స్థాయిలను వివరిస్తూ "పదము - స్పందన" ల గురుంచి అద్భుత వివరణను ఈ ప్రవచనంలో అందించారు. జానామి ధర్మం నచమే నివృత్తి - చెయ్యకూడదు అని తెలుసు, కానీ ఆ తప్పు చేస్తాం, ఆ తప్పొప్పుల పట్టిక వేసుకుని జీవిస్తేనే అది తపస్సు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవోమహేశ్వర: అను ప్రార్ధనను చేసేప్పుడు మనం ఉచ్చరించే ప్రతి పదము వెనకాల ఉన్న శక్తిని గుర్తించి చెయ్యాలి, సమస్త సృష్టిని చెయ్యగల బ్రహ్మ, దానిని పరిపాలించే విష్ణువు, లయకారకుడైన శివుని శక్తులను కలిగి ఉన్న ఏకైక గురుచేతనత్వాన్ని మనం లోతుగా అర్ధం చేసుకుంటూ ఆ పదాలకు స్పందిస్తూ చేస్తే మనం ఆ మౌనంలోకి వెళ్తాం, మౌనం మాటలలు రానప్పుడు, మాట్లాడలేనప్పుడు మనస్సంతా స్పందనతో నిండినప్పుడు ఏర్పడే స్ధితి.

7.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురువుల యొక్క చేతనత్వము అనగా పదార్ధ విజ్ఞానమే . మరి సైన్స్ కు దీనికి తేడా ఏమిటి ? "పదములు పదార్ధములుగా మారటము గురుచేతనత్వము". పదార్ధముగా ఏర్పడిన పదముల లక్షణాలను గమనించటం పదార్ధ విజ్ఞానము ( సైన్స్). వాటి వెనకాల ఉన్న చేతనత్వం గురుంచి మాట్లాడేది ఆధ్యాత్మిక విజ్ఞానము. ఆధునిక విజ్ఞానము కేవలం పదార్ధ జ్ఞానాన్ని అందిస్తుంది, దానికి వెనకాల ఉన్న చేతనత్వం మీద మనకు అవగాహనను ఇచ్చే విద్య ఆధ్యాత్మిక విద్య. ఇప్పుడు ఉన్న వర్ణ వ్యవస్థకి పిచ్చివాడి ప్రేలాపనకు పెద్ద తేడా లేదు. వృక్ష సంపద, ఖనిజ సంపద, జంతు సంపదను ఉపయోగించే ప్రాణిగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు తప్ప మనిషికూడా ప్రకృతిలోని ఒక సంపదే అని గుర్తించలేకపోతున్నాడు. ఒక సత్య సాయి, రమణ మహర్షి ఇలా ఎంతో మంది గురువులు వాళ్ళని వాళ్ళు ప్రకృతిలో భాగంగా అనుకున్నారు. అలాంటి వాళ్ళ వల్ల భూమికి ఉపయోగం. పృధ్వియొక్క దివ్యప్రణాళిక తెలియని మానవులు భూమిమీద జీవించే అధికారం కోల్పోతారు, వాళ్ళు రాక్షసులే. సూర్య, చంద్ర & అగ్నుల యొక్క శక్తి మానవుల్ని దివ్యత్వం వేపుకు తీస్కొనివెళ్తాయి. సూర్యుడు, చంద్రునియొక్క శక్తి ద్వారా మాత్రమే మనం చూడగల్గుతున్నాం, అవే లేకపోతే మనకి దృష్టే లేదు. శ్రీ సూక్తం, పురుష సూక్తం అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాలి. గురువుల యొక్క మూల స్థానం తిరుపతి. ప్రతి వ్యక్తి ఈ విశ్వం నాది, ఈ ప్రపంచం నాది అనే భావనతో జీవించటం మొదలుపెట్టాలి.

8.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అగ్ని విద్య - ధుని : పృధ్వి యొక్క పరిణామ క్రమములో తన పని తను చేస్కుంటూ ఉంటుంది. భూమి పెట్రోల్ తయారుచేసుకోవటానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది, అలాంటి పెట్రోల్ ను మనం ఎలాంటి అవసరాలకు వాడుతున్నాం ? మనిషి పరాన్నభుక్తుడు. పృధ్వి ఏర్పరచుకున్న సంపద - బొగ్గు, ఇనుము, బంగారము. పెట్రోల్ ఇలా తనలో కొన్ని సంపదలను ఏర్పరుచుకుంది. మన కోసమే అవన్నీ ఏర్పడినట్టు మన ప్రవర్తన ఎంత తప్పో అర్ధం అవుతుంది. పృధ్వి మాత కి చాలా దయ ఉంది, మనల్ని భరిస్తోంది. శ్రీ సూక్త, పురుషసూక్త మంత్రాలను కలిపి చదివే పధ్ధతిని సుదర్శన విద్య అంటారు, సు - దర్శనము అంటే ప్రపంచాన్ని సరిగ్గా దర్శించగలగటం. అగ్ని యొక్క సహజ లక్షణం ఉత్సాహము. అగ్ని విద్యలో ప్రవేశము పొందదల్చుకున్నవాళ్ళు దీపావళినాడు మాత్రమే మొదలుపెట్టాలి. ధైర్యము , సాహసము ఇవన్నీ లక్ష్మీ విద్య. లక్ష్మీ విద్య అన్నా అగ్ని విద్య అన్నా ఒక్కటే. అగ్ని ఉపాసన యొక్క శాస్త్రీయ పధ్ధతి యజ్ఞము. అగ్ని యొక్క పరాకాష్ట ఆవు, అగ్ని భౌతిక శరీరధారిగా కనిపించింది అంటె అది ఆవు. అందుకని దత్తాత్రేయుని వద్ద, కృష్ణుడి దగ్గర ఆవు ఉంటుంది, ఆవు యొక్క మల మూత్రములు చాలా పవిత్రమైనవి.

9.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మానవ జాతి భూమి మీద ఒక అతిధి మాత్రమే అనే జాగురూకత మనకి అందరికీ ఉండాలి. ప్రపంచములో మనకు కనిపిస్తున్న ప్రతి కణము చేతనత్వమే. సాటి మనిషిని చంపితే ఉరిశిక్ష, సాటి ప్రాణిని చంపితే ??? కేవలం ఇంద్రియసుఖాలమీద ఆధారపడి జీవించే మనుషులకు , జంతువులకి ఎలాంటి తేడా లేదు, ఒక్క ధర్మం మాత్రమే వేరు. కొంతమంది వ్యక్తులను ఎన్ని శతాబ్ధాలైనా గుర్తు పెట్టుకుంటాం, కబీరును రాజు కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేస్తే ఆయన ఋగ్వేదంలోని " యాతీనాం బ్రహ్మా భవతి సారధి...." అనే మంత్ర తరంగాలను ఉపయోగించుకుని ఆయన బయటికి వచ్చాడు. ఎలాంటి బంధనాలనుండైన ఈ మంత్రాలను ఉపయోగించుకుని బయటపడవచ్చు. రాజు పేరు మనకు గుర్తు లేదు, కానీ కబీరు పేరు మన అందరికీ తెలుసు, ఆయన ఏ చదువు చదవలేదు, కానీ ఆయనకి ధర్మం తెలుసు, అంతే.ఆధ్యాత్మిక జ్ఞానికి బేసిస్ అగ్ని. e=mc2 అనే ఫార్ములాలో మొత్తం న్యూక్లీర్ ఎనర్జీ ఉంది అంటె నమ్ముతున్నాం, మరి వేదాలలో అన్నీ ఉన్నాయి అంటే నమ్మలేని బుధ్ధి దారిద్రము భారతీయులకు ఎందుకు వచ్చొందో అర్ధం కావట్లేదు, మన సంస్కృతి యొక్క గొప్పతనము, గురువుల యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతే ఎలా ? పదమును పదార్ధముగా మార్చే విద్య కేవలం భారతీయ గురువుల వద్దే ఉన్నది. వేద సంస్కృతి పునర్జాగరణ జరగాలి. మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ కూర్మంవలె ఉంటుంది. శ్వాస ద్వారా జరిగే మంథన మన శరీరానికి ఓషధులుగా పని చేస్తుంది. మనలో ఉన్న ధన్వంతరిని తెలుసుకోవాలి. పూజలు కొబ్బరికాయలతో మీకు ఈ జ్ఞానం రాదు.

10.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

శబ్ధ విజ్ఞానాన్ని మాస్టర్ చేసిన వ్యక్తులు గురువులు. ఈ విద్య నేర్చుకుంటె మీరు కూడా ఆహారాన్ని అక్షయంగా మార్చగలరు, ఇసుకను బంగారంగా మార్చగలరు. కృతజ్ఞత అనే సద్గుణం మనం మర్చిపోయాము. ఓంకారాన్ని భారతీయులు కనిపెట్టారు, భారతీయులు అంటే వెలుగుపై శ్రధ్ధ కలిగినవారు. 7 సంవత్సరములకు ఒకసారి మన శరీరంలో ప్రతి కణం మారుతుంది,బోన్స్ నుండి జుట్టు వరకు అన్నీ మారతాయి. ఆ కాల ప్రవాహాన్ని అర్ధం చేసుకోవాలి. కాలము యొక్క శబ్ధము "ఓంకారాం"నుండి వస్తున్నది, అది ఆకాశము నుండి వస్తుంది. రూపము ఉంది అంటే అగ్ని ఉన్నది. మీకు రూపం ఉంది, పేరు అనే శబ్ధం ఉన్నది అంటే మీరు అగ్ని స్వరూపులే, శబ్ధ స్వరూపులే. జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు, నామము, రూపమునకు మధ్య ఉన్న స్పర్శను మిస్స్ అయ్యాము మనము, అదే సమర్థ సద్గురు స్పర్శ. పదము పదార్ధముగా మారటమే యోగవిద్య, దీనితో యోగ విద్య మొదలవుతుంది . పదమును పదార్ధముగా మార్చే విజ్ఞానమును అద్భుతంగా వివరించారు, ప్రతి సాధకుడు తప్పక తెలుసుకోవలసిన ఈ విషయాన్ని విని నోట్స్ రాసుకుంటేనే ఉపయోగకరంగా ఉంటుంది.

11.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

శ్రీ రామకృష్ణ పరమ హంస తను ఎంతో కష్టపడి సాధన చేసి అమ్మ అనుగ్రహం పొందాక, పరమే వ్యోమన్ లోకి ప్రవేశించటానికి ఆ అమ్మ రూపాన్ని కూడా వదిలెయ్యాల్సి వచ్చింది. శారీరకంగా పూర్తిగా అలసిపోయి, మానసికంగా సంధ్యా సమయాలలో సాధనలు చేసినవాళ్ళు ఈ పరమే వ్యోమన్ స్ధితిలోకి తేలికగా వెళ్ళగలరు. గురువులంతా పరమే వ్యోమన్ స్ధితికి చేరినవారే, అదే అద్వైత స్ధితి. గురువుని దర్శిస్తున్నంతసేపు ఆయన ముఖాన్ని దర్శింస్తున్నంతసేపు మీరు కూడా ఆ మహా శూన్య స్ధితిలోనే ఉండగలరు, అందుకే షిరిడీ సాయి తాను 12 ఏల్లు తన గురువునే దర్శించాను అని చెప్పారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని నేను చెప్పిన మానసిక స్ధితిలో ఒక సంవత్సరం పాటు చేస్తే మీరు కూడా ఆ పరమే వ్యోమన్ స్ధితిలో ఉండీ గురువుల వలె అందరికీ, అన్ని ప్రాణులకు సహాయం చెయ్యగలరు. నేను ఆ మహా శూన్యము నుండి ఆవిర్భవించాను, ఒక మహా శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోంది అనే జాగురూకత కంటిన్యుయస్ గా ఉండాలి.

12.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

శాంత స్ధితికి క్షీరసాగరమని పేరు, ఈ మౌనాన్ని మనం మంథన చేస్తాం. మనలో జరిగే సంఘర్షణ, మంథన వల్ల మనం అలసిపోతాం, దేవతల అలసట అంటే దైవీ ప్రణాళికలో భాగంగా అలసిపోవాలి, భౌతిక సుఖాల వెంపర్లాటలో కాదు. ఇందులో ఎప్పుడూ రాక్షసులే ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. భావాతీతమైన, గుణాతీతమైన, పరమ శూన్య స్ధితిని శాంత స్ధితి అని అంటాం. పరమ శాంతస్ధితినుండి మనకు కావల్సిన దేవతాశక్తులను మనం పొందటమే సముద్ర మంథనం. మౌన స్ధితిలోకి వెళ్తే సముద్ర మంథన తరువాత వచ్చే 14 దేవతాశక్తులు ప్రతి రోజూ ఈ సాధనలో మీకు వస్తాయి. హలా హలం అంటే పరిణామక్రమానికి అననుకూలముగా ఉన్న అలోచనలే.

13.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ధ్యానము: భగవద్గీత సద్గురువులందరి జీవిత చరిత్ర. ఏ గురు చరిత్ర పారాయణ చేసినా అధ్యయనం చేస్తూ చెయ్యాలి. మూర్తీభవించిన భారతీయ అధ్యాత్మికత శిరిడీ సాయి. సట్కాతో నేల మీద కొడితే అగ్నిని, నీటిని కూడా తెప్పించగలడు, పంచ భూతాలు ఆయన అధీనంలో ఉన్నాయని మనకి చరిత్రలో అర్ధం అవుతుంది. సాధన అంటే అంతర్గత యాత్ర. శ్వాస ఆ భగవంతుని ప్రతినిధి. ఆ శ్వాస మన పరిస్ధితులు బట్టి మారుతుంది, తదాత్మానం సృజామ్యహం. అలాంటి శ్వాసని మనం మర్చిపోయాము, మనకి భగవంతుడు ఎలా హెల్ప్ చెయ్యగలడు? శ్వాస దాని శక్తితో అది పని చేస్తోంది, అది "ఆత్మమాయయా", శ్వాస ఉండటం పోవటం మన చేతిలో లేదు. శ్వాసను ఎలా గమనించాలి అనేది " సమంకాయ శిరోగ్రీవం" అనే ధ్యాన యోగములోని శ్లోకములో చెప్పబడి ఉంది. ఇలా నిటారుగా మీరు కూర్చొని ఉంటే ప్రకృతిలోని సమస్త సంపదలు మీ వేపు పరిగెత్తుకుని వస్తాయి.

14.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

వర్ణ వ్యవస్థను ఇంత అమేఘంగా, వైజ్ఞానికంగా ఇప్పటివరకూ ఎవ్వరూ వివరించలేకపోయారు అనేది సత్యం, ఈ ప్రవచనం అందరూ తప్పక వినాలి. మనం ప్రకృతి యొక్క వ్యవస్థ లో భాగం అవ్వాలి కానీ మనం పెట్టుకున్న నియమాలకి మనమే బంధీలు కాకూడదు. పరిణామ క్రమములో వర్ణ వ్యవస్థ అనేది ఒక్క భారతీయ విధానములోనే ఉన్నది. జాగృతావస్థలో ఉన్నా నీవు స్వప్నావస్థలోను, నిద్రావస్థలోను, తురీయావస్థలోనూ కూడా ఉండగలగాలి. చేతనత్వ స్థాయిలు ఈ నాలుగింటిలోను జీవించగలిగేటటువంటి విద్య చేతనత్వ విద్య. శివం, శాంతం, అద్వైతం, చతుర్ధం మన్యంతే స ఆత్మ. వర్ణ వ్యవస్థ, చేతనత్వ స్ధితులు ఒక్కటే. సూద్ర స్ధితి జాగృత స్ధితి ఒక్కటే(పాదాలు).

15.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మనస్సు, పుస్తకములు, ఒపీనియన్స్ ద్వారా చేతనత్వాన్ని అర్ధం చేసుకోలేము. కళ్ళు మూసుకున్న మరుక్షణం బాహ్య జగత్తుతో మీ సంబంధాన్ని కోల్పోతారు, కళ్ళు మూసుకొని ఒక 30 నిమిషాలు ఉంటే స్పేస్ తో సంబంధం పోతుంది, "ఓం" కారముతో కాలాన్ని అదుపుచెయ్యవచ్చు. కాలమును దాటి కాలములో ఉండే ట్రిక్ వివరించారు. నా శరీరం ఉన్నా లేకపోయినా నేను మీకు నా దగ్గర ఉన్న అధ్యాత్మిక విద్యను అడిగితే ఇచ్చేస్తాను అని శిరిడీ సాయి వాగ్దానం చేసారు. అందుకు సాయి పారాయణ మీకు బాగా ఉపయోగపడుతుంది, పదమును పదార్ధముగా ఎలా మార్చాలో అర్ధం అవుతుంది. గురువులంతా ఓంకార స్ధితిలోనే ఉంటారు. ఆ గురుచరిత్రలు చదివినప్పుడు ఓం మరియు చరిత్ర ఒక స్ధితిలో ఏకమై మిమ్మల్ని ఓంకార స్ధితిలోనే ఉంచుతాయి. శ్రీం - సంపదలు పెంచుకొనుటకు కలిసి ఆహారం తీస్కొనుట తప్ప వేరే మార్గం లేదు, అందుకు అందరూ కలిసి భోజనం చెయ్యాలి. ఆహారం స్వీకరించేటప్పుడు విశ్వకర్మా సూక్తమును వినండి. ఏ రోజు యంత్రమును ఆ రోజు వేస్కొని ఆహార

16.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురువు ఆ దేశకాల పరిస్ధితులను బట్టి బ్రహ్మ వద్దనుండి వచ్చే సందేశాన్ని పట్టుకుని శిష్యులకు అందిస్తారు.సప్తఋషుల ద్వారా దర్శింపబడినది వేద వాంజ్ఞయము మనకు మునుల ద్వారా పురాణ సంహితగా మనకు అందచేయబడింది. వేద సంహిత - సప్తఋషులు, పురాణ సంహిత- మునులు. మనం మౌనముతో మునుల స్ధితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాము, దానిని ఉపయోగించుకునే వ్యక్తి ఋషి. వేదాలు క్లుప్తంగా ఉంటాయి, పురాణాలు విస్తృతంగా వేదాలలో బోధించిన సత్యాలను తెలుపుతాయి. అగ్ని పురాణము ప్రాణుల యొక్క జీవించే లక్షణానికి ఆధారము. మన శరీరములో అగ్ని ప్రవాహానికి అడ్డుపడిన రోగాలను అధిగమించేందుకు మనకు అగ్ని పురాణములో అందించిన స్తోత్రము సర్వరక్షాకర స్తోత్రము. "అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజా, నశ్యంతీ సకలా రోగా: సత్యం సత్యం వధామ్యహం". అపామార్జన స్తోత్రములో దీని లాభాలను గురుంచి ఉంది. ఇది శిరిడీ సాయి ఉపయోగించిన మంత్రము. అచ్యుత స్ధితి - బాధ్యతలు తప్ప బంధములకు లొంగకుండా ఉండటం. ఋషులు పృధ్వి యొక్క వాస్తు మారుస్తున్నారు, దానికోసమే నేను పోల్ షిఫ్ట్ సాధన చేయిస్తున్నాను. 1 % మనుషులు మారితేనన్నా ఈ పనిని ఋషులు చెయ్యగలరు.

17.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ఆధ్యాత్మికత అనేది అనేక జన్మల సంసిధ్ధత, అనేక జన్మలలోని పరిణితి. ఆధ్యాత్మిక జీవితంలో పరిణితి చెందటానికి ఎవరికైన 19 పరికరాలు కావాలి. టైం టేబుల్ తప్పక వేస్కొని సరిగ్గా దానిని అనుసరిస్తేనే మీరు మీ జీవితంలో ఉన్నతిని సాధిస్తారు, దీనిని తప్పక ఆచరించాలి, రోజుకి 4 గంటల సమయం వీటికి కేటాయించగలిగితే మంచిది. సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానాన్ని 12 మంది మన గురుసత్తాలోని గురువుల జీవిత చరిత్రలు & వాళ్ళ జీవితాలను మథించి మీకు అందించాను. ప్రస్తుతము మన ఇంద్రియాలను మనము ఉపయోగించుకోవటంలేదు, అవి మనల్ని ఉపయోగించుకుంటున్నాయి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము వలన ఇంద్రియాల మీద ఆధిపత్యము, అద్భుతమైన మెమొరీ వస్తాయి.

18.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అంతర్ గ్రహ యాత్ర ఎలా చెయ్యాలి ? ప్రతి రోజు ఆహారం తీస్కునేప్పుడు తప్పనిసరిగా ఆ రోజు యంత్రాన్ని వేస్కోండి. దీనివల్ల మీకు ఆ గ్రహాలతో సంబంధము ఏర్పడుతుంది. భగవద్గీత 15వ అధ్యాయము వినటం, విశ్వకర్మా సూక్తము వినటం, అచ్యుతానంత గోవింద మంత్రము, ప్రాణాగ్నిహోత్ర ఆహుతులు తప్పనిసరిగా పాటించాలి. బుధవారంనాడు యంత్రము ద్వారా బుధ గ్రహానికి వెళ్ళవచ్చు, అంటే మీ చేతనత్వాన్ని బుధగ్రహ చేతనత్వముతో ట్యూన్ చేస్కోవచ్చు. ఫోన్ లో నంబర్లు డయల్ చేస్తే ఆ వ్యక్తిని మనం కాంటాక్ట్ చెయ్యగలం. ఒక సైక్లిక్ ప్రోసెస్ లో నంబర్లను తిప్పినప్పుడు దేశ కాలములో ఒకానొక బిందువు వద్దకు వెళ్ళగలరు అనేది సత్యం. సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానంలో మీరు మాస్టరీ చేస్తే ఈ అంతర్ గ్రహ యాత్ర మొత్తం మీకు అర్ధం అవుతుంది. తారా చంద్రుల కలయిక వెనకాతల ఉన్న సైన్స్ ను అద్భుత రీతిలో వివరించారు. కమ్యూనికేషన్స్ సరిగ్గా ఉంటే మన నెర్వస్ సిస్టం కరెక్ట్ గా పని చేస్తుంది. మళ్ళీ మళ్ళీ విని తెలుసుకోవాలసిన ఎన్నో సాధనాత్మక రహస్యాలను ఈ ప్రవచనంలో అందించిన సమర్థ సద్గురు దేవుల చరణాలకి నమస్సుమాంజలి. దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని పంచేందుకు ఈ వీడియోలను షేర్ చెయ్యవలసిందిగా ప్రార్ధన.

19.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

వేంకట రాయలు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవలసినది సమర్పణ. ఆయన విషపు జంతువుల దగ్గరకి వెళ్తే అవే అడవిలోకి పారిపోయాయి, అలానే మీ వల్ల తోటి మనుషులలో ఉన్న క్రూరత్వము నశించాలి. తిరుపతి వేంకటేశ్వర స్వామికి ఈ నాటికి కోయ జాతులవారు ఇద్దరు ఒకరు కుడి కాలు చెప్పు, ఇంకొకరు ఎడమ కాలి చెప్పు తెచ్చి పెడతారు, అవి మళ్ళీ సంవత్సరానికి అరిగిపోయి ఉంటాయి. కపిల తీర్ధంలో మీరు దీన్ని దర్శించవచ్చు. సమర్పణా భావం ఉంటే ఈ నాటికీ అలాంటి అద్భుతాలు మీ జీవితాలలో జరుగుతాయి, దర్శించే కళ్ళు ఉంటే. ఆ మహాకలచక్రవర్తీ రాజ్యములో మనం అందరం ఆయన ప్రజలము అని గుర్తుంచుకొని జీవించాలి. దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని పంచేందుకు ఈ వీడియోలను షేర్ చెయ్యవలసిందిగా ప్రార్ధన.

20.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మనం యజ్ఞం ఎంత శ్తధ్ధగా చేస్తామో అంతే శ్రధ్ధగా ఆహారాన్ని తీస్కోవాలి. ఆహారం తీసుకున్నాక మాస్టర్ సి.వి.వి. ధ్యానంలో కూర్చుని "నేను తీసుకున్న ఆహరం సృష్టిలో ఎక్కడ ఎక్కడ అన్నార్తులై ఉన్నారో వాళ్ళందరికీ అందుగాక" అనుకోవాలి. జగద్గురువుయొక్క గురుచేతనత్వమే ఓంకారము. మొట్టమొదట ఓంకారము అచ్యుత స్ధితికోసం చేస్తాము, దేనికీ చెలించని స్ధితి. మన శరీరంలో 6000 మైళ్ళ పొడుగు ఉన్న రక్తనాళాలు ఉన్నాయి, శరీరంలో ఏ భాగానికి ఏ ఆహారం కావాలో దాన్ని అందిస్తుంది. ఇది మన ప్రమేయంతో జరగటం లేదు, ఓం అనేది అచ్యుత స్ధితి. పరశురామతత్వన్ని దింపుకునేందుకు మనం 21 సార్లు చెయ్యాలి. పరశురాముడు అహంకారం ఉన్న క్షత్రియుల్ని 21 సార్లు నరికారు. ఓం అనగానే " క్లేశ కర్మ విపాక ఆశయైర్ అపరామృష్ట: పురుష విశేష: ఈశ్వర:" అలాంటి పురుషవిశేషత కలిగిన ఈశ్వర స్ధితి "ఓంకారము". 75% మనం చేసిన కర్మ రిజర్వాయర్లో ఉంటుంది, దాంట్లో 25 శాతంలోంచి మాత్రమే మనకు ఒక జన్మకి సంబంధించిన కర్మలు ఇవ్వబడతాయి, అదీ సమయానుసారము. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో చేసే ప్రతి ఓంకారము మీ శరీరాలను కడిగేస్తుంది, సమస్త రోగాలు నశిస్తాయి. చాలా శ్రధ్దగా వింటే కానీ సమర్థ సద్గురుదేవులు చెప్తున్న ఓంకార ధ్యానాం వెనకాల భావనని, మనలో ఉన్న గురుచేతనత్వాన్ని మనం అర్ధం చేసుకొనలేము, మళ్ళీ మళ్ళీ విందాం, అందరికీ ఈ ప్రవచనామృతాన్ని అందిద్దాం.

21.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వములో జంతు ప్రజ్ఞను ఎలా ఉపయోగిచుకున్నారు ? శిరిడీ సాయి యొక్క అవతార ప్రాకట్యము మొదట ఆయన బిజిలీ, చాందినీ అనే గుర్రములతో మొదలుపెట్టారు, బిజిలీ - విద్యుత్ సౌదామినీ యాధా. నిరంతర గతిశీలత కలిగినది, "శ్వ" అంటే నిన్న రేపు అనే భావన లేకుండా జీవించగల్గుట, నిరంత గతిశీలత అనేది వర్తమానములోనే జరుగుతుంది. నిత్య నూతనమైన మనస్సు లభించాలంటే "సాధకులు" తాజా అహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అగ్ని సంపర్కములోకి వచ్చిన ఆహారము 3 గంటలలోపు తింటె మంచిది. మన సాహసము, తెలివి, మనస్సు మన కంట్రోల్ లో ఉండటమే ఇంద్రుడి వాహనము ఏనుగు. ఏనుగు తెలివి, బలములకు ప్రతీక. దీని యొక్క ఘీంకారమునకు విఘ్నములు పోగొట్టే శక్తి ఉన్నది. అందువల్ల రాజులకి దగ్గరలో ఏనుగులు ఉంచుకునేవారు, దీని ఘీంకార శబ్ధమును విన్నా ( రికార్డెడ్) అవరోధాలు తొలగిపోతాయి. సత్య సాయి ఏనుగును ఉపయోగించుకున్నారు. గోవు యొక్క చేతనత్వమును దత్తత్రేయుడు, కృష్ణుడు ఉపయోగించుకున్నారు. కృష్ణుడు గోవు వద్ద నిలబడే భంగిమ చాల ముఖ్యమైనది, మోచెయ్యి ఆవు మూపురమునకు ఆనించి త్రిభంగిమలో నిల్చుని ఉంటాడు. గోవు సేవ 52 వారములు అనగా సంవత్సరము పాటు చేస్తే ఇంద్ర స్థాయికి చేరవచ్చు, మన చేతనత్వమును ఆవు పవిత్రముగా మారుస్తుంది, మనము పూర్తి తన్మయత్వముతో సేవ చేస్తే లాభమును పూర్తిగా పొందవచ్చు. వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు గోసేవ వలన పోతాయి. మళ్ళీ మళ్ళీ విందాం, అందరికీ ఈ ప్రవచనామృతాన్ని అందిద్దాం.

22.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

తల్లి, తండ్రి & గురువు ఈ ముగ్గురినీ త్రిమూర్తులు అంటారు. వాళ్ళ ఋణాన్ని తీర్చుకోలేం. జన్మనిచ్చిన తల్లి ఋణం తీర్చుకునేందుకు సాక్షాత్తు ఆది శంకరులవారు అవతార మూర్తి అయ్యి కూడా సన్యాన దీక్ష తీసుకున్నప్పటికీ తన తల్లికి అంతిమ సంస్కారం తానే చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. మనకు జన్మనిచ్చిన తల్లి, మానసిక ఎదుగుదలకి దోహదం చేసే తండ్రి, అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఋణం తీర్చుకోలేనిది. ఈ ఋణానుబంధం, కృతజ్ఞతా భావం లోపించటంవల్లే భారతీయ సంస్కృతి దెబ్బతింది. కృతజ్ఞత అనేది ఒక భావన, ఆ భావన గురువుపైన పెంచుకోవటం వల్ల ఆ గురువుతో ఋణానుబంధం పెరుగుతుంది. దీనికి గురుగీత ఎంతో సహాయపడుతుంది. సమర్థ సద్గురు శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవుల చరణాలకు నమస్కరిస్తూ మరో ప్రవచానమృత ధార స్వీకరిద్దాం, మన గురువుతో మన ఋణానుబంధం పెంచుకుందాం.

23.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వంలోకి ప్రవేశించటం ఎలా ? "భూర్" బౌతిక జగత్తు తలంలో (ఇన్స్టింక్ట్) సహజ లక్షణాలు పని చేస్తాయి. కుక్కకి విశ్వాసం, ఎద్దు ఎద్దువలె ఎక్కువ పని చెయ్యగలగటం ఇవన్నీ వాటి సహజ లక్షణాలు. ప్రస్తుతం మానవజాతి ఇన్స్టింక్ట్ నుండీ "ఇంటలెక్ట్" తెలివి తేటలు ఉపయోగించుకుంటోంది, పకృతి యొక్క లక్షణాలను తన వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటోంది. గురువుల యొక్క ఈ చేతనత్వం రెండింటినీ అధిగమిస్తుంది, వాళ్ళు ఇంట్యూషన్ లొ జీవిస్తారు. శిశువు తల్లి గర్భంలోనుండి బయటికి వచ్చేంతవరకు పితృలోకమునుండి వారి శక్తి ప్రేరణతో పనిచేస్తాడు. దీనినే మనం కొంతవరకు జెనెటిక్స్ అంటాం, ఇది లో లోపలినుండి పనిచేస్తుంది. అయిడియాస్, ఐడియల్, అయిడల్ ను అత్యద్భుతంగా వివరించారు. మనస్సు పరిధి దాటాక, 6 డిగ్రీ అయిపోయాక గురువులు 7వ డిగ్రీ లోకి ప్రవేశిస్తారు, సహస్రార సిధ్ధి. జంతు స్ధితిలో ఉండే ఈ శరీరములోనే సహస్రార సిధ్ధిని బుధ్ధుడితో కలిపి మొత్తం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పొందారు.

24.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ఆకాశ తత్వ సాధన : కళ్ళు మూసుకుంటె కానీ దృష్టిగోచరము కాని దేవతా శక్తులు ఏ లోకంలో ఉన్నాయి? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు కొన్ని శబ్ధముల సమూహము మన చెవులను తాకినప్పుడు మనకు కొన్ని అనుభూతులు వస్తాయి, ఆ పదముల అర్ధము మనకు ఇదివరకు తెలుసు కాబట్టి. అది మనకు తెలియని భాష ఐతే మనకా మాటలయొక్క అనుభూతులు రావు. దేవతా శక్తులు అంటే ఏమిటో మనకు తెలియదు కనుక అవి ఎదురుకుండా ఉన్నా మనకు కనిపించవు. ఆకాశ తత్వము యొక్క అభివ్యక్తి తెలుసుకోవాలంటే ఈ మాటల అంతరార్ధం తెలుసుకోవాలి. గురువు చెప్తున్న విషయాల అర్ధము, మీరు అనుకుంటున్న శబ్ధముల అర్ధము ఒకటి కాదు. అన్ని దేవతా శక్తుల మూల స్థానము ఆకాశమే. పుస్తక జ్ఞానము అనేది మీ వ్యక్తిగత అనుభవాల అనుభూతి మాత్రమే. ఆకాశ తత్వము జాగృతమైన గురువులు దివ్య చక్షువులు ప్రసాదించగలరు, బాహ్యంగా కన్నులు మూసుకుంటె కానీ దివ్య చక్షువులు తెరుచుకోవు. "యత్పదం దర్శితం ఏన" ఏ అక్షరాలను దర్శించామో...వేదాలను ఋషులు లిపిబధ్ధం చేయలేరు, అవి అపౌరుషేయములు. లిపిబధ్ధం చెయ్యలేని ఈ వేదాలను దర్శించటం ఎలా ? పరమే వ్యోమన్ ను దర్శించటం నేర్చుకోవాలి.ఈ ప్రవచనాన్ని మనం మాస్టరీ చెయ్యగలిగితే సర్వ దేవతల్ని శాసించవచ్చు.

25.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మాండ్యూకోపనిషత్ : ఋషి చేతనత్వములోకి గురువుల చేతనత్వము లోకి తేలికగా ప్రవేశించే మార్గము ఉపనిషత్ . ఇది అధర్వణ వేదానికి సంబందించిన్నది. ఇది మండ్యూక అనే చేతనత్వానికి సంబంధించింది. 33 దేవతా శక్తులని మనము, మాకు ఏది జరిగినా అది మన మంచికే, ప్రతి పనికిరానిది పనికివచ్చేదానికి బలము అనేటటువంటి మానసిక స్థితిని ఇవ్వమని ప్రార్ధిస్తున్నాము . శాంతి పాఠముతో మొదలవుతుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికమైన మూడు రకాలైన అవరోధాలు ఏర్పడుతుంటాయి. 3 సార్లు ఓం శాంతి అన్నప్పుడు ఈ మూడు రకాలైన అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళేందుకు సహాయపడుతుంది, అందుకని 3 సార్లు " ఓం శాంతి, శాంతి, శాంతి" అని చెప్తాం. ఈ ఉపనిషత్ పారాయణ వలన శారీరిక, మానసిక, ఆత్మిక తుష్ఠి కలుగుతుంది. ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభి: ! వ్యశేమ దేవహితం యుదాయు: ! స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న: పూషా విశ్వవేదా ! స్వస్తి నస్తార్ క్ష్యో అరిష్టవేమి: ! స్వస్తి నో బృహస్పతి ర్దధాతు !! ఓం శాంతి: శాంతి: శాంతి:

26.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

1. ఓం మిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవిద్భవిష్యదితి సర్వమోకార ఏవ I యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ II ఈ లోకం యావత్తు ఓంకారమే, గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ ఓంకారమే. మూడు కాలాలకు అతీతమైనది ఓంకారమే. 2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా సో2యమాత్మా చతుష్పాత్ II ఇవన్నీ భగవంతుడే, ఈ ఆత్మకూడా భగవంతుడే, ఈ ఆత్మ నాలుగు పరిణామాలు గలది. ద్వాపర యుగము అంటే - ఇఛ్ఛా సంఘఠనలు. మనకి ఒక సంవత్సరము దేవతలకి ఒక రోజు, ఒక సంవత్సరంలో వచ్చే అనుభూతి ఒక రోజులో వస్తే మీరు రామ కృష్ణ పరమహంస శిష్యులు. త్రికాలాతీత స్ధితి నుండి భౌతిక జగత్తు యొక్క స్ధితికి మధ్యలో ఉన్న వారధి అరబిందో వారధి (ఇంటెగ్రల్ యోగా) . ఆ వారధి నుండి పైన ఉన్న లోకాలకి క్రింద ఉన్న లోకాలకి వెళ్ళగలిగే ప్రజ్ఞను, " ప్రజ్ఞా పుత్రులు" అనే పేరుతో ఆ స్ధాయికి వెళ్ళగలిగే స్ధితి శ్రీ రామ శర్మ ఆచార్య అందించారు. శాంత స్ధితిలో ఉన్న చేతనత్వమే అద్వైత స్ధితి. చేతనత్వం లో జాగృత స్ధితిలో వైశ్వానరుడు, స్వప్న స్ధితిలో తైజసుడు అంటారు. వైశ్వానర స్ధితినుండి తైజసిక చేతనత్వంలోకి వెళ్తే అంతర్ దృష్టి స్పష్టమవుతుంది, అది అంత: ప్రజ్ఞ. మాండ్యూకపనిషత్ లోని 1,2,3 & 4 శ్లొకాలను వైశ్వానరాగ్ని గురుంచిన చక్కటి వివరణతో పాటు ఉదాహరణలతో సహా అందించారు.

27.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వము యొక్క వివిధమైన డైమెన్షన్స్ ఓంకారము యొక్క వివిధరూపాలు. వ్యష్ఠిగా వైశ్వానరుడు - సమిష్ఠిగా విరాట్ వ్యష్టిగా తైజసుడు - సమిష్ఠిగా హిరణ్యగర్భుడు. పిల్లవాడు చిన్నప్పుడు కష్టపడి నేర్చుకునే నడక ఉద్దేశ్యం ఎదిగాక ఎక్కడికి వెళ్ళాలంటే అటువైపు స్వయంగా నడుచుకుని వెళ్ళగలగటం. అలానే మనం హిరణ్యగర్భలోకాన్ని ఉపయోగించుకునేందుకు తైజసుడి సహాయంతో అంతర్దృష్టితో లక్ష్యం వైపు నడవగలగాలి. జాగృదావస్థలో జరిగే సంఘఠనలన్నీ హిరణ్యగర్భలోకంలో మొదట జరుగుతాయి. మనకు ఉపయోగపడే ఆలోచనలకి మాత్రమే జాగృదావస్థలో రూపం ఇస్తాం, మనకి నచ్చని ఆలోచనలు వదిలేస్తాం. వాటిని వేరే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంత: ప్రజ్ఞ - తైజసుడు, బాహ్య ప్రజ్ఞ - వైశ్వానరుడు. కోరికలు హిరణ్య గర్భలోకం నుండి విరాట్ లోకంలోకి అంటే స్థూల జగత్తులోకి వచ్చే వార్తాహరులు. మాండ్యూకోపనిషత్ పై శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురు దేవులు అందించిన ఈ అత్యద్భుతమైన వివరణను మళ్ళీ మళ్ళీ విందాం, అందరికీ అందిద్దాం.

28.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

నా అంత: ప్రజ్ఙ న బహి: ప్రజ్ఞ నోభయత: ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం, నా ప్రజ్ఞం . అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం అలక్షణం, అచింత్యం అవ్యపదేశ్యం, ఏకాత్మా ప్రత్యయసారం ప్రపంచోపశమనం, శాంతం, శివం, అద్వైతం, చతుర్ధం, మన్యంతే స ఆత్మా సి విజ్ఞేయ:. నాలుగవ పరిమాణం, అది అంతర్ముఖ స్ధితి కాదు, బహిర్ముఖ స్ధితి కాదు, రెండు చేరిన స్ధితి కాదు. అది చైతన్యం సమకూరిన స్ధితి కాదు, చేతన స్ధితి కాదు. అది కనిపించదు, చేతలు లేని, గ్రహింప శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన వర్ణనాతీతమైన స్ధితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం, అక్కడ ప్రాపంచిన చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయితం, ఇదే నాలుగవ పరిణామం, ఇదే ఆత్మ, దీన్నే తెలుసుకోవాలి.

29.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

జీవితంలో అభివృధ్ధిని సాధించాలి అంటే భగవత్ భక్తుల సహాయం మనకి కావాలి, వారి సహాయం లేకుండా మనం ఎదగలేం. శాంత, శివం, అద్వైతం, చతుర్ధం , మన్యంతే స ఆత్మా సివిజ్ఞేయ:. ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయితం. ఇదే నాలుగవ పరిణామం, ఇదే ఆత్మ. దీనిని తెలుసుకోవాలి. మాండ్యూకోపనిషత్ లోని 9 వ శ్లోకంను వివరించారు. అకార సాధన వలన భౌతిక జగత్తులోని సమస్త కోరికలు తీరుతాయి. అకార సాధన చెయ్యగలుగుతున్నాము అంటే మనలోని వైశ్వానరుడు పని చేస్తున్నాడు అని, దానిని గుర్తించి సాధన చేసుకొంటె అద్భుతమైన ఫలితాలను పొదవచ్చు.

30.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ఛాందోగ్యోపనిషత్ ముఖ్యంగా వైశ్వానరుడి గురుంచి చెప్తుంది, మాండ్యూకోపనిషత్ నాలుగు స్థాయిలగురించి అంటే విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు గురించి వివరంగా చెప్తుంది. తైజస ప్రజ్ఞను క్షణాలమీద మార్చుకోవచ్చు, హిరణ్య గర్భలోకంలో మనకు భౌతికలోకంలో ఉండే నియమాలే వర్తిస్తాయి. బౌతికలోకంలో మీరు కుటుంబాలు, పరిస్ధితులు ఏర్పరుచుకున్న విధంగా హిరణ్య గర్భలోకంలో కూడా ఏర్పరుచుకోవచ్చు. అక్కడ కేవలం మీ ఆలోచనలతో పరిస్ధితులను తక్షణమే మార్చుకోవచ్చు. లక్ష్య శుధ్ధికొరకు పనిచేస్తూ అలసిపోయినప్పుడు అకారం నుండి ఉకారాంలోకి ప్రవేశిస్తారు. ఎవరికైతే స్వప్నలోకంలో కూడా జీవించగల్గే సమర్ధత వస్తుందో వాళ్ళ కుటుంబాలలో అజ్ఞాని జన్మించడు. మకారాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తి ఈశ్వరుడితో సమానము. దీనితరువాత వచ్చే నిశ్శబ్ధ స్ధితే ఆత్మ స్ధితి. ఇది గురుచేతనత్వముయొక్క అనగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్ కు పరమావధి.

31.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ప్రతి ఉపనిషత్ లోను మొదటగా ఉన్న మంత్రము ఆ ఉపనిషత్ వల్ల వచ్చే ఫలితాన్ని తెలుపుతుంది. ఈశావాస్యోపనిషత్ చదవటం వలన పూర్ణత్వం లభిస్తుంది అనేది మనకు మొదట ఉన్న " పూర్ణమదం, పూర్ణమిదం" అనే మంత్రమువలన తెలుస్తుంది. డబ్బా, ఆరోగ్యమా ? సంపదలా? ఇవన్నీ మీకు శాంతిని ఇవ్వవు, కానీ శాంత స్ధితిలో ఉంటే ఇవన్నీ మీకు వస్తాయి. శాంతంగా ఉంటే శివం అంటే మంగళకరమైన పరిస్ధితులు వస్తాయి. అందువల్ల మనం రెండుపూటలా చేసే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వలన ఆ పరమ శాంత స్ధితి మనకు లభిస్తుంది. చేతిలో అమృత భాడం ఇచ్చి చేసుకోండి అని చెప్తుంటే అది చెయ్యకుండా మీరు మీ జీవితాలని పాడుచేసుకుంటే ఏ గురువూ ఏమీ చెయ్యలేడు. అనంతమైన జ్ఞాన సంపద మీ సొంతం చేసే ధ్యానము ఇది. దీనికి సమయం లేదు అంటే ?

32.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

వ్యష్ఠి వ్యక్తిగతమైన - సమిష్టి సామూహికత. 4 ఆశ్రమాలగురించి వివరించారు. బ్రహ్మచర్యము అంటే కాలాన్ని సదుపయోగం చేసుకొనుట. యతీనాం బ్రహ్మ భవతి సారధి అనేది వ్యక్తిగా దర్శిస్తాడు. వ్యక్తి వ్యష్ఠి నుండీ సమిష్ఠికి వెళ్ళటం గృహస్థాశ్రమం. సంబంధం లేని రెండు కుటుంబాలు వారి బంధుమిత్రులతో సహా ఆత్మబంధువులుగా మారటం. శ్రీ విద్యను ఉపాసన చేసినవారు సమిష్ఠిగా జీవిస్తారు, వ్యక్తి నుండి సమిష్ఠికి ఎదుగుతారు. తరువాత వారు ఒక విశాల ఆధ్యాత్మిక పరివారములో సభ్యులుగా చేరాక హిరణ్య గర్భలోకంలో ప్రవేశం జరుగుతుంది. ఆధ్యాత్మిక తైజస నుండి హిరణ్యగర్భంలోకి ప్రవేశించినవారికి ఒకే లక్ష్యం ఉండాలి. మహాత్ములను విమర్శీస్తే ప్రకృతి మనల్ని క్షమించదు, వాళ్ళు ఈశ్వరీయ జగత్తులోకి వెళ్ళినవాళ్ళు. వానప్రస్థాశ్రమంలో అంత: ప్రజ్ఞయొక్క సమిష్ఠి చై

33.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ఆధ్యాత్మిక జీవితం, గురువుల జీవితాన్ని మనం ఎలా జీవించాలి అని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. రానున్న లక్షా ఢెభై ఎనిమిదివేల సంవత్సరాలవరకు ప్రణాళికను అర్ధం చేసుకోవాలి. మనిషి భూమి మీద ఆవిర్భవించి ఒక కోటీ తొంభై ఐదువేల సంవత్సరాలు అయ్యింది అని ఒక లెక్క. మనం సంధి కాలంలో ఉన్నాము. గురువుల ప్రణాళిక అంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. విశ్వప్రణాళికలో భాగంగా దానికోసమే మన పుట్టుక, చావు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న జీవితం కూడా దీనిలోని భాగమే, దీనికోసం మీకు ఏ వనరులకోసం మీరు ప్రయత్నించాలసిన అవసరం లేదు, అవన్నీ ముందే ఏర్పాటు చేసి ఉంటాయి. విశ్వప్రణాళికలో మీరు జీవిస్తున్న అవేర్నెస్ మీకు వచ్చి అందులో భాగంగా మీరు జీవిస్తే మీరు చెప్పిందే వేదంగా మారుతుంది. ఈ విశ్వప్రణాళికను అర్ధం చేస్కొని పని చెయ్యటానికి ఒకటి - అహంకార రహితంగా పని చెయ్యటం, రెండు ప్రేమమయంగా జీవించటం.

34.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

భగవద్గీత మొత్తం సారం ఏంటీ అంటే, భౌతిక జగత్తుకి సంబంధించి నీకు ఏది తెలిస్తే అది పరిపూర్ణంగా చెయ్యి, ఆధ్యాత్మికతకు సంబంధించి "కరిష్యే వచనం తవ" గురువు ఏది చెప్తే అది చెయ్యి. 84 సంవత్సరాల యువకుడు అయిన అర్జునుడు, 125 సంవత్సరాల శ్రీ కృష్ణుడిని " నా రధాన్ని రెండు సేనల మధ్య పెట్టు నేను ఎవరితో యుధ్ధం చెయ్యలో చూస్కోవాలి" అన్నాడు. విశ్వప్రణాళికలో భాగమే అని తెలుసుకోకుండా జీవించటమే మాయ. గురువుతో ఋణానుబంధం పెంచుకోవాలి. దుర్గా సప్తశతి రాబోయే మన్వంతరం ప్రణాళికగురుంచి మాట్లాడుతుంది, ఇది తెలుసుకోకుండా కేవలం మీ కోరికలు తీర్చుకునేందుకు మీరు ఇలాంటి జ్ఞానాన్ని వాడుకుంటున్నారు అనే బుధ్ది మీకు వచ్చినా మంచిదే. మీకు విశ్వప్రణాళిక అర్ధం కాకపోతే గురువు భౌతికంగా లేనప్పుడు ఆ గురువు నుండి వచ్చే ఆజ్ఞలు మీమనస్సు అనే కళ్ళజోడుతో చూడటం వలన దాని నిజ స్వరూపం మారిపోతుంది. అందుకు గురువే మీ శ్వాసగా మారితే అప్పుడు, కరిష్యే వచనం తవ.

35.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వంలో మాస్టర్స్ డిగ్రీ ద్వారా కలిగే జ్ఞానంతో దేవతలను శాసించగలరు. దేవాలయాలలో ప్రదక్షిణలు చేసేప్పుడు మీ దృష్ఠి నిరంతరం మీ కాళ్ళ బొటకనవేళ్ళ మీద ఉండాలి, ఇది మీ దృష్ఠిని గురువు పాదాల మీద ఉంచుతుంది. ఇది ఒక గొప్ప సాధన. అష్టవశువులు అనగా పృధ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుధ్ధి & అహంకారము. వీటితో సంబంధించిన ఏ పని అయినా అది అష్టవశువులు అనగా భౌతిక జగత్తు యొక్క ప్రకృతే. వీటి ధర్మాలను మీరు మార్చలేరు. ఈ పంచతత్వాలను మనం ప్రస్తుతం మనస్సును మాత్రమే ఉపయోగించుకుని వీటిలో మార్పు తీస్కొనివస్తున్నాం, గాయత్రీ మంత్రం సర్వజనీనం చెయ్యటానికి కారణం వీటిని బుద్ధిని ఉపయోగించుకుని వాడుకోవటానికి. వ్యక్తిగతంగా అనుభవంలోకి రానిది బుధ్ధి, అనుభవంలోకి వచ్చేది మనస్సు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా మీరు ఆకాశంలోకి ప్రవేశించగలరు, అంటే మూల ప్రకృతిలోకి వెళ్ళగలరు.. బుధ్ధిని సవరించుకునేందుకు ఆకాశంలో ఉన్న శక్తిని గాయత్రి అంటాం, అందుకని గాయత్రిని అందరికీ అందుబాటులోకి తెచ్చారు గురుదేవులు. దీపం పెట్టటం ద్వారా మనలో సమ దృష్ఠి వస్తుంది, ఆ దృష్టి ఉంటేనే మనం ఏ దేవతా ఉపాసన అయినా చెయ్యగలం. కలశములో మనము జలము పెడతాము, జలము యొక్క తత్వము ఏది వేసినా అంకురింపచేస్తుంది. బీజాలు జలమువలననే అంకురిస్తాయి. మీలోని సుసంస్కారములు ప్రోదిచేసుకునేందుకు జల తత్వాన్ని ఉపయోగించుకోండి.

36.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ప్రతి విద్యకి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఆయుధాలు ఉంటాయి. మంత్రాల కంటె మీ మనస్సు చాలా శక్తివంతమైనది అని అర్ధం చేసుకోవాలి. భగవంతుని ఉపాసన చేస్తే ఆయన చేతిలోని ఆయుధాలను మనం ఉపయోగించుకోవాలి. బాణాన్ని ఉపయోగించుకున్నవాడు రాముడు, చక్రాన్ని ఉపయోగించుకున్నవాడు విష్ణువు, శూలము, బల్లెము కార్తికేయుని ఆయుధము, వినాయకుడి యొక్క ఆయుధము పాశము, అంకుశము. పరిణామక్రమములో మీ పాత్ర తెలుసుకుని జీవించటమే సుదర్శన చక్రము. ఎవరు సుదర్శనాన్ని అనగా సమయాన్ని సద్వినియోగం చేస్కుంటారో వారి వద్ద లక్ష్మి ఉంటుంది. ఆశ్రమాలు దేవతా శక్తులను ఉపయోగించుకోవటం నేర్చుకునే ల్యాబ్స్. 9 గ్రహాలు 12 రాశులలో తిరుగుతుంటాయి, ఈ 9*12=108 చక్రీయగమనము అనేది జపమాలగా మనం బ్రహ్మ చేతిలొ చూస్తాం. మనం ఉచ్చరించిన పదాలను మనం పాటిస్తే అది శంఖాన్ని ఉపయోగించుకోవటం.

37.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మనం మన ఆత్మని గుర్తించనంతసేపూ మనం కూడా జంతుస్థాయికి చెందినవాళ్ళమే. మనం 5 వేల సంవత్సరాల నుండి చేస్తున్న తప్పు ఏమిటి అంటె పృధ్విని ఎవరో వచ్చి స్వర్గంగా మారుస్తారు అని అనుకోవటం, కానీ పృధ్వి స్వర్గతుల్యం చెయ్యటానికి మనం దేవతలుగా మారాలి, అది మనలో జరగాలి. 2000 లో పృధ్విపై స్వర్గావతరణకు కావలసిన వ్యవస్థ సూక్ష్మ లోకాలలో జరుగుతోంది, పృధ్వి మీద స్వర్గావతరణకు కావలసిన ఆహారం ఉడుకుతోంది, దీనిని పదును మీద దింపుకుంటె మనం దీనిని సరిగ్గా స్వీకరించి అందరికీ పంచవచ్చు. ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒక లయబధ్ధత ఉన్నది, అన్నీ వాటి సమయానుసారము పని చేస్తున్నాయి. ఒక్క మానవుని ప్రవర్తనను మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. అగ్నిసూక్తములోని 9 నియమాలు అర్ధం అయితే సకల దేవతలతో సంబంధము వచ్చేస్తుంది.2000 సంవత్సరము అంటె శ్రీ కృష్ణ నిర్యాణం తరువాత 5101 వ సంవత్సరము. గురుదేవులు అందించిన అగ్ని విద్యను అందరూ మాస్టరీ చెయ్యాలి. అందరికీ శాంతి, సుఖము, సమృధ్ధి కలగాలనే లక్ష్యంతో మనమీ సాధనలను చేస్తున్నాం.

38.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

శిరిడీ సాయి శ్రీచక్రోపాసనను ప్రపంచానికి అందించటానికి వచ్చారు, అయినా భక్తుల యొక్క కోరికకు వదిలేసారు. ఆయన రెండు మేకలు కొన్నారు ఒకటి తెల్ల మేక, రెండవది నల్ల మేక. మేకలు అగ్నిదేవుని వాహనము, అంటే "ద్విజపంక్తి ద్వయోజ్వలా". ఆ ప్రజ్ఞాన ఘన స్ధితి మీద బేస్ అయ్యి నేను సప్తర్షి ఆశ్రమములో ధునిని ఏర్పాటు చేసాను. మొత్తం గురుసత్తా కలిసి ఒక చోట ఉంటే ఏ సంఘఠనలు జరుగుతాయో ఆ సంఘఠనలు సప్తర్షి ఆశ్రమములో జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఎవరి ప్రజ్ఞను మార్చుకుంటారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ శక్తిని పొందుతారు. అచ్యుతానంద గోవింద అనే మంత్రము వలన అన్ని రోగాలు పోతాయి. ఈ మంత్రముతో స్థూల శరీరంలో రోగాలే కాదు, మీ జీవితంలోని అడ్డంకులు కూడా పోతాయి. పరమ పూజ్య గురుదేవులు ఏ సాధన చేసినా ఆ సాధనను అఖండజ్యోతి ద్వారా అందరికీ పంపించేసేవారు. మీ ఆహారము మీ మనస్సులను మారుస్తుంది, అందుకని ఆహారాన్ని తీస్కొనే విధానాన్ని సరిగ్గా పాటించండి. ఆహారాన్ని మారిస్తే కఠోర హృదయం కలిగినవాళ్ళ మనస్సుని కోమలంగా మార్చచ్చు. అచ్యుతానంత గోవింద మంత్రము, విశ్వకర్మా సూక్తము, అగ్ని సూక్తము ద్వారా ఒక స్ట్రెక్చర్ద్ కాన్షియస్నెస్ ( చేతనత్వము) డెవెలప్ అవుతుంది.

39.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

యంత్రము - తంత్రము : మంత్రము అనగా ఒకే భావము కలిగిన ఆలోచనను మీరు నిరంతరము రిపీట్ చేస్తారు. భాష్పకణాలన్నీ ఒక చోట చేరి వర్షించినట్ట్లు మంత్ర తరంగాలు ఒకే చోటకు చేరి సిధ్ధిని ప్రసాదిస్తాయి, అనగా పదము పదార్ధముగా మారుతుంది. అక్షర లక్షల జపాలు చెయ్యటానికి కారణం అది. మన ప్రతి శ్వాసలోపలికి వెళ్ళి బయటికి వస్తున్నప్పుడు ఈ 5 భాగాలుగా మారతాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అను 5 వాయువులుగా మారతాయి, వీటిలో బ్యాలెన్స్ లోపించినప్పుడు రోగాలు వస్తాయి. అహారము తీస్కునేటప్పుడు ప్రాణ ఆహుతులు వేస్కోవాలి, దీనివలన కొంతకాలానికి 5 వాయువులు బ్యాలెన్స్ అవుతాయి, ఈ 5 వాయువులు సక్రమంగా ఉన్న వ్యక్తి దగ్గర కూర్చొని మీరు ఈ తింటే, లేదా వారి నామం తల్చుకుని తింటే వారి శరీరములోని నిర్మలత్వము & పవిత్రత మీకు వస్తాయి. యంత్ర విద్యలో భాగంగా లక్ష్మీదేవికి మన హృదయానికి, విష్ణుమూర్తి ఆయుధాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యాత్మిక వైజ్ఞానిక దృష్ఠితో అద్భుతంగా వివరించారు. రుద్ర స్ధితి సూక్ష్మతలంలో ఉంటుంది, ఏకాదశ రుద్రులకు కామమయ తలానికి ఉన్న సంబంధము, 11 అనే సంఖ్యకు, శనివారానికి శివుడి అభిషేకానికి ఉన్న సంబంధాన్ని వివరించారు. జలము వైబ్రేషన్స్ ను సంగ్రహణ చేస్తుంది కాబట్టి మనం ఆహారము తీస్కునేప్పుడు ఉంగరం వేలుతో నీటితో యంత్రాన్ని గీస్కుంటాం. మళ్ళీ మళ్ళీ వింటే కానీ అర్ధం కాని అద్భుత మంత్ర, యంత్ర, తంత్ర విజ్ఞానాన్ని ఈ ప్రవచనంలో అందించిన శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవులకు కృతజ్ఞతాంజలి.

40.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

భగవత్ తత్వానికి లొంగి ఉన్నప్పుడు మనకు సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపుల్ అనగా ఆత్మ తత్వము మనలో పని చేసి మనం సువ్యవస్థమైన జీవిత విధానాన్ని జీవిస్తాము. మన ఇంట్లో మనం పెట్తుకునే వస్తువుల అమరిక, శుచి వీటన్నింటిలో మనకు సువ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. మంత్ర దీక్ష తరువాత ఆగ్ని దీక్ష, ఆ తరువాత బ్రహ్మ దీక్ష. మంత్ర దీక్షలో మంత్ర జపం చెయ్యగా చెయ్యగా అగ్నిని పుట్టిస్తుంది, అందుకు దానితో పాటు అగ్నిహోత్రం చేస్తాం, అగ్ని దీక్షలోకి వెళ్తాం. నిప్పులో వేసిన ఏ పదార్ధమైనా ఆ వ్యక్తిలో ఉన్న ప్రకృతికి నియమానికి విరుధ్ధమైన అన్ని లక్షణాలు, దుర్గుణాలు అన్నీ భస్మమై పవిత్రంగా బయటికి వస్తాడు. అగ్ని దీక్ష తరువాత బ్రహ్మ దీక్ష. సమర్థ సదుగురు స్పర్శ ధ్యానం వల్ల లభించే స్ధితి "యతీనాం బ్రహ్మ భవతి సారధి", అది బ్రహ్మ దీక్ష. ఆత్మచైతన్యం ప్రోధి అవ్వటానికి కావలసిన పరిస్ధితులు కల్పిస్తానని పృధ్వి ఒప్పుకుంది, పృధ్విమీద ఏ మానవులు దీనికి అనుగుణంగా జీవించరో వాళ్ళని పృధ్వి తన పై ఉండనివ్వదు. అందుకని ఈ జ్ఞానాన్ని వీలైనంత ఎక్కువమందికి అందించటంకన్నా పెద్ద సేవ ఏదీ లేదు.

41.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా సక్రియ మౌనంలోకి ప్రవేశించటం ఎలా అనే విషయంపై మన ఆలోచనలలో తెచ్చుకోవలసిన మార్పులు, వేద జ్ఞానాన్ని వివరిస్తూ మాస్టర్ ఆర్ కె ధ్యానం చేయించారు. భూమిపై స్వర్గావతరణ అనగా మనం ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గీయ వాతావరణాన్ని నిర్మించాలి, దానికి మనం డైనమిక్ సైలెన్స్ ( సక్రియ మౌనంలోకి) ప్రవేశించాలి. ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఉన్న ఆ మౌనాన్ని పట్టుకోవాలి. ఈ ధ్యానం పై సిరీస్ గ ఇస్తున్న ఈ ప్రవచనాలను జాగ్రత్తగా విని అర్ధం చేసుకుంటే సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానాన్ని మాస్టరీ చెయ్యవచ్చు. గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ అను ప్రవచనములలో సమర్ధ సద్గురు స్పర్శ జ్ఞానం అతి ముఖ్యమైనది. ప్రజ్ఞాన ఘన ప్రేమ స్వరూపులు అయిన మాస్టారు మనల్ని ప్రజ్ఞాన ఘన స్ధితికి తీస్కెళ్ళటానికి ఇచ్చిన ఈ ప్రవచనాలు అత్యంత అమూల్యమైనవి.

42.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

మన శరీరమునే ధునిగా భావించి ఆహారాన్ని ఆహుతిగా సమర్పించాలి. ఆహారమును వీలైనంత సమూహికముగా స్వీకరించాలి. ఆహారమును స్వీకరీంచటానికి ముందు విశ్వకర్మా సూక్తమును విని, తరువాత ఉంగరం వేలితో నీటిలో ముంచి ఆ తడివేలుతో పళ్ళెములో ఆ రోజు యంత్రాన్ని గీసుకుని ఆహారాన్ని తీస్కోవాలి. ఏ వ్యక్తి అయినా, ఏ జాతి, మత కుల లింగములో ఉన్నా అందరికీ ఉండేవి ఆ ఏడురోజులు, ఏడు గ్రహాలకు చెందిన ఏడు రోజులలోనే మానవ జీవితం ఇమిడి ఉన్నది. దానిని గ్రహించి గ్రహాలకు అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా జీవించాలి. తన సర్వస్వాన్ని ధార పోసి మాస్టారు ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనకి అందించారు. మాస్టారు అందించిన ఈ అమృతత్వవిద్యని, ప్రతిరోజు మీవద్దకు వచ్చే ఈ వీడియోలను దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ షేర్ చెయ్యండి. వేల సంఖ్యలో ఉన్న మన మాస్టారి పరివారములో ప్రతి వ్యక్తి కనీసం 5 గురుకి ప్రతిరోజూ ఈ జ్ఞానాన్ని పంచితే ఎంతో గురుసేవ చేసిన భాగ్యం లభిస్తుంది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.

43.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అమృతత్వ విద్య : ప్రతిరోజు ఆహారమును తీసుకునేప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలను గత కొద్దిరోజుల ప్రవచనములలో విన్నాము . ఇప్పుడు మొత్తం అన్ని వివరాలను ఒకసారి పునరావలోకనం చేసుకుందాం. అహారాన్ని తీస్కొనే ముందు కొద్దిసేపు "తతశ్చ్యా విరభూత్ సాక్షాత్ శ్రీ రమా భగవత్ పరా రంజయంతే దిశ: కాంత్యా విద్యుత్ సౌదామినీ యధా" అను శ్లోకాన్ని చేస్కొవాలి. తరువాత విశ్వకర్మా సూక్తాన్ని వినాలి. నీటిలో ఉంగరం వేలును ముంచి పళ్ళెంలో ఆ రోజు యంత్రాన్ని గీస్కోవాలి. "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం" అను మంత్రాన్ని చెప్పుకుని ముందు 5 ప్రాణ ఆహుతులను "ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా" తీస్కోవాలి. మౌనంగా అహారాన్ని కొంచెం కొంచెం నములుతూ ఆనందంగా, శాంతంగా ఆహారాన్ని తీస్కోవాలి. తిన్నతరువాత వజ్రాసనంలో కానీ, సుఖాసనంలోకానీ కూర్చొని సి.వి.వి ధ్యానము చేస్కోవాలి. " నేను తీస్కొన్న ఆహారము ఆకలితో ఉన్న సమస్త ప్రాణికోటికీ అందుగాక" అని అనుకుని 5 నిమిషాలపాటు కూర్చోవాలి. అమృతత్వవిద్యను ఎవరు మాస్టరీ చెయ్యదలచుకున్న ఇంతకంటే సులువైన మార్గం మరొకటిలేదు. ఈ అలవాట్లను చేస్కొంటే మన తరం, మన పిల్లలు అందరూ ఎంతో ఆరోగ్యంతో చక్కటి సంస్కారవంతులుగా జీవించగలుగుతారు. ఆలోచించండి, నేటి పరిస్ధితులలో మనకు ఈ విద్య ఎంత అవసరమో ? ఇవి నేర్చుకునేందుకు కేటాయించే సమయము ఎంత లాభదాయకమో ? మనుష్యులను దేవతలుగా మార్చే ఈ అమృతత్వ విద్య, ఆహారము తీస్కొనే పధ్ధతిని అందరూ తప్పక పాటించి దైవత్వాన్ని వికసింపచేస్కొగలరని భావిస్తూ - సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

44.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ లో భాగంగా నిన్న కాలం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం. మీరు తిన్న ఆహారమే మీ వాక్కుని ఏర్పరుస్తుంది, అందుకు అచ్యుతానంత గోవింద అనే మంత్రము అంత శక్తివంతమైనది అని తెలుసుకోండి. ఆహారము మీలో ఉన్న వైశ్వానర రూపంలో ఉన్న అగ్ని. మనం తీస్కునే ఆహారాన్ని ఆ అగ్ని వైఖరీ వాక్కు, మధ్యమ వాణి, పశ్యంతీ వాణి , పరా వాణి స్ధితులకు సంబంధించిన ఆహారాలను మన శరీరంలోకి ఎక్కిస్తాడు. సోమో భూత్వా రసాత్మక:, మనం తిన్న ఆహారం సోమరసంగా మారుతుంది, దాని " కీ " మన వాక్కులో ఉంది. మీరు వాడే పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. వాక్కుని ఎదుటిమనిషిని ఉత్తేజ పరచటానికి, ఉత్సాహపరచటానికి ఉపయోగించాలి, అవసరమైనచోట మాత్రమే మాట్లాడాలి. ఎవరైన సలహా అడిగితేనే ఇవ్వాలి. ఆహార సంయమముతోపాటు వాక్ సంయమనం కూడా పాటించాలి. గురువుల వద్ద, గురువుల సమాధి వద్ద ఉండే వెలుతురు మీరు చూడాలంటె వాక్కు ని పట్టుకోవాలి. భారతీయులు జగత్ విజేతలు. భారతదేశ ఋషిసాంప్రదాయం, గురు సాంప్రదాయం, ఆశ్రమ వ్యవస్థలు, గురువులు, బ్రహ్మచర్య ఆశ్రమాలు వీటికి మూలం. 5 మే 2000 పోల్ షిఫ్ట్ డేట్. అనీబిసెంట్ చనిపోయాక ఆవిడని ఒక వ్యక్తి కాంటాక్ట్ చేస్తే ఆవిడ ఒక మెసేజ్ ఇచ్చారు, అది ఒక పుస్తకంలా వచ్చింది, ఆవిడ వాక్కు ముఖ్యం. గురువు వాక్కు ముఖ్యం, గురువు వాక్కు వింటూ ఉంటే మీరుకూడా గురువులు అవుతారు. మీ దగ్గరకి వచ్చిన వారిని కల్పవృక్షముగా, కామధేనువుగా అనుగ్రహించగలిగే శక్తి ఈ విద్య ద్వారా మీకు లభించాలనే ఉద్దేశ్యంతీ నేను మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అనేది మర్చిపోకుండా సాధనామయ జీవితాన్ని జీవించటం అలవరచుకోండి.

45.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

నేను చెప్తున్న ఈ విద్య ఇప్పుడు అక్కడ ఇంకా చెప్పబడటంలేదు. గురు ప్రణాళికలు ఇదివరకు ఇంత విరివిగా చెప్పబడలేదు, ఇప్పుడే చెప్పబడటానికి కారణం ఏమిటి? ఏ టి వీలు పెట్టినా, మొబైల్స్ లోనైన, ఇంటర్నెట్లోనైనా ఎంతో మంది గురువులు అధ్యాత్మిక విద్యను గురుంచి మాట్లాడుతున్నారు. ఈ సమయం నూతన యుగానికి, నూతన ప్రణాళికలకి సంబంధించినది. అందువల్ల ఇప్పుడు గాయత్రీ మంత్ర ఆవశ్యకత ఉన్నది. నూతన యుగావతరణకు దేవత గాయత్రీ మాత, మంత్రము గాయత్రీ మంత్రము, ఇది అర్ధం అయితే గురువుల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవని మీకు అర్ధం అవుతుంది. 1975 కి ఈ నూతన యుగావతరణ కార్యక్రమం అయిపోవాలి, కానీ ఇప్పటికీ ఇంకా జరగలేదు, వెనకబడి ఉన్నాం అని గ్రహించాలి.విశ్వప్రణాళికను అర్ధం చేసుకుంటే ఒక సాయి, ఒక శ్రీ అరబిందో, ఒక శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులకు ఎటువంటి బాధ్యత ఉన్నదో మనకీ అదే మాధ్యత ఉన్నది అని అర్దం అవుతుంది. జన:, తప: సత్యం లోకంలో ఉండే వ్యక్తులు మనకు సూపర్ వైజర్స్. మహర్లోకవాసులు మన కొలీగ్స్. భూర్, భువ:, స్వ: లోకవాసులు మనకింద పని చేసే సహాయకులు.

46.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అగ్ని విద్య - ప్రజ్ఞలు గురుంచి ప్రజ్ఞానఘనులైన మాస్టారు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రవచనం. ఇలాంటి సబ్జెక్ట్ ఇంత వివరంగా, ఇంత సులువుగా ఏ గురువు చెప్పినట్లు ఏ ప్రవచనాలలోను ఎవ్వరం వినలేదు. పూజ్య శ్రీ మాస్టర్గారు 1999 డిసెంబరు 31 లోపు ఎంతో గుప్తమైన, రకరకాల స్థాయిలకు చెందిన సంపూర్ణ అధ్యాత్మిక జ్ఞాన - విజ్ఞానాన్ని కలబోసి మానవజాతికి అనుగ్రహించారు. ఎంత వినగలం, ఎంత అర్ధం చేసుకుని ఆచరించగలం అనేది మన చేతిలో ఉంది. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎవరికి ఈ జ్ఞాన ఖని అవసరమో మనకు తెలీదు, మనం చెయ్యగలిగింది మనం చేస్తూ మాస్టారి వాణిని మనకు తెలిసిన అన్ని మాధ్యమాల ద్వారా అందరికీ అందించటమే.

47.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అగ్ని దీక్ష: మనకు భౌతిక జగత్తులో కనిపిస్తున్న ప్రతి వస్తువు ఉండటానికి కారణం కారణ జగత్తులో దానికి సంభంధించిన ఆలోచన ఉండటమే, కాబట్టి ఈ జగత్తులో మనకు కనిపిస్తున్న అన్ని వస్తువుల వెనకాల ఒక ఆలోచన ఉన్నది, అది అన్ని చోట్ల ఉన్నది కాబట్టి సర్వత్రా ఉన్నది. ఆ - లోచనలు, మనకు వద్దు అనుకుంటే వాటిని మనం చూడం, కానీ అవి అక్కడే ఉంటాయి. మన ఆలోచనలు తక్షణమే రూపు దాలుస్తాయి, అది మన వాస్తవిక స్ధితి. కోరికలు మనోమయ తలం యొక్క తరంగాలు, మనం వాటిని ఆపలేం. మన వాస్తవికత ఆలోచనలలో ఉంది, ఆలోచనలు లయం అవుతాయి కానీ నాశనం కావు, నువ్వు కూడా నాశనం కావు, అమరుడివే. ఆలోచనలలో క్రాంతి రావాలి. ఆలోచనలు మనస్సు అనే అగ్ని యొక్క స్పుల్లింగాలు. అదే మనం అగ్ని కుండానికి వేసే నలుపు, ఎరుపు, తెలుపు. వీటిద్వారా అగ్నికుండంలోని అగ్నికి ఒక విశేషమైన దిశను ఇస్తాం. పవిత్రత అంటే అగ్ని, మన ఆలోచనలు గో రూపం తీస్కోగలిగితే మనం కూడా అగ్నిస్వరూపంగా మారినట్లే.

48.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

అమృతత్వ విద్య : నేను,నా కుటుంబము అనే కోరక ఉన్నటువంటి స్ధితి జంతు స్ధితి. పరమ స్వార్ధముతో ఈ ప్రపంచము అంతా నాది అనేవాడు రాక్షసుడు. ఈ ప్రపంచం అంతా ఒక విశాల ప్రణాళిక భాగంగా ఉంది, దానికి అనుగుణంగా జీవిస్తాను అనేవాడు ఋషి. ఈ 3 రకాలైన జీవిత విధానాలు మనకు తెలియాలి. మానవ శరీరము మొత్తము ఋగ్వేదములోని 192 శ్లోకములతో ఏర్పడింది. ఋగ్వేదీయ సూత్రముల కలయిక మానవ శరీరము. ప్రకృతి ప్రతి దేవతకు ఒక లక్షణాన్ని ఇచ్చింది. పంచ భూతములకు పంచ సూక్తములు ఉన్నాయి, వాటిలో అవి ఎలా పని చేస్తున్నాయో చెప్పబడి ఉంది. మీ శరీరాలలో పనిచేసే 5 శక్తి ధారలు. సంధ్యావందనములో మంత్రపూరితంగా తీస్కునే జలమే మీ శరీరంలో అమృత కలశంగా పని చేస్తుంది. యజుర్వేద మంత్రములలో నీటి యొక్క శక్తి అర్ధం అయితే ప్రాణశక్తి అర్ధం అవుతుంది. ప్రాకృతిక నియమాలకు అనుగుణంగా జీవించాడు కనుక, దేవతా శక్తులకి అనుగుణ్యంగా జీవించటం వల్ల గురువులు ప్రకృతిని శాసించగలరు, దేవతలను శాసించగలరు. మీరు కూడా ఆ స్ధితికి ఎదగటానికి నేను చెప్పే ఈ అమృతత్వ విద్యను ఆచరణలోకి తెచ్చుకోండి.

49 .గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

విశ్వప్రణాళికలో భాగస్వామ్యమునకు సూర్య నమస్కారములు : శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురుదేవులు విశ్వప్రణాళికకు సూర్య నమస్కారములను ఒక వినూత్న రీతిలో అందించారు. సూర్య నమస్కార మంత్రాలను, నమస్కారములతో పాటు చేసుకుంటూ ఆయా ఆసనములో చేయవలసిన భావనను అద్భుత రీతిలో చేయించారు. ఒక్కో ఆసనము, చక్రము, గ్రహము, ఆ గ్రహము నుండి మనలోకి గ్రహించాల్సిన శక్తికి తగిన భావనలను ఈ వీడియోలో విజుయల్స్ లో అందించటం జరిగింది. గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీలో భాగంగా మనం విశ్వప్రణాళిక్లో భాగస్వామ్యానికి ఉండవలసిన మానసికస్ధితిని కొన్ని ప్రవచనాలలో విన్నాం, దానిలో భాగంగా ఆ మానసిక స్ధితితో పాటు మనం ఆచరించవలసిన నమస్కారములు తెలియచేసారు. మాఘ పౌర్ణమి సందర్భముగా అందిస్తున్న ఈ వీడియోను అందరూ ఆచరించి, ఆదరిస్తారని భావిస్తూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు .

50.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ధ్యానములో ఉండవలసిన భావన : ప్రస్తుతం మీరు జీవిస్తున్న జీవిత విధానం వలన మీరు గురువులకు బరువే అనే విషయాన్ని గ్రహించాలి. మీరు చేసే ధ్యానాలు, పూజలు కూడా బరువే, ఎందుకంటే మీరు అహంకారం అనే రాయితో చేస్తున్నారు. మీరు మీ అహంకారాన్ని వదులుకోలేనంతసేపు, గురువుల పని చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, గురు ప్రణాళికలో పని చేస్తున్నాం అనుకున్నవాళ్ళు అంతా గురువులకు బరువే. గురుదేవులు 24 సంవత్సరాలపాటు గాయత్రీ మంత్రాన్ని రోజుకి 8 గంటలు జపం చేసారు. 16 వ ఏట ఆయనకు గురు దర్శనం అయ్యాక అయన పనిని 41 వ ఏట మొదలుపెట్టారు. మీరు సాధకులు మాత్రమే, గురువుల పని చెయ్యటం లేదు. ఈ తేడా అర్ధం చేసుకుని రంగంలోకి దిగి పని చేస్తే మంచిది. 1,95,000 వేల సంవత్సరాల తరువాత 1999 లో వచ్చిన ఈ మార్గశిరమాసపు పునాదులు 1,78,000 సంవత్సరాల వరకు కొనసాగబోతున్నది. అంచేత మీరు ఎన్ని సంవత్సరాల ప్రణాళికను మీ ధ్యానములో డౌన్లోడ్ చేస్కోగలరో చేస్కోండి. ఆ గురుప్రణాళిక, విశ్వప్రణాళిక నాకు అర్ధం కావట్లేదు అనే ఆవేదన మీరు ధ్యానంలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి. "కరిష్యే వచనం తవ " - ధ్యానంలో మీకు వచ్చిన ప్రతి అనుభవాన్ని డైరీ లో రాస్కోండి.

51.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ప్రేమ ధ్యానము - సమస్యా పరిష్కారము : ప్రేమ మూర్తి, ప్రజ్ఞావతారము అయిన శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్థ సద్గురు దేవులు అందించిన ఈ ప్రేమ ధ్యానము చాలా ముఖ్యమైనది. ఎన్నో అధ్యాత్మిక సత్యాలు ఈ ధ్యానంలో అంతర్వాహినిగా అందించారు. గురువులకు ఉండే ప్రేమ ఎటువంటిది ? ఈ ధ్యానాన్ని వింటే మనల్ని పరిణామక్రమంలో ముందుకు తీస్కొనివెళ్ళేందుకు వాళ్ళు అహర్నిశలు ఎంత శ్రమిస్తారో మనకు అర్ధం అవుతుంది. ఒక తల్లి తెల్లవార్లు మేల్కొని తన పిల్లవాడి నిద్రకు భంగం రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది, దానికోసం ఎంతో అలసి పోతుంది, ఆ అలసటలోనే తృప్తిచెందుతుంది. మాతృప్రేమ నిజమైన ప్రేమ అని మనకు అనిపిస్తుంది. మరి గురువులకు ఉండే ప్రేమ విశ్వవ్యాప్తమైన ప్రేమ. మన కష్టాలను నివారించుకొని, గురువుకి సర్వసమర్పణతో జీవించేందుకు ఉపయోగపడే కామధేనువు, కల్పవృక్షమువంటి ఈ ధ్యానం ప్రతి వ్యక్తికి అవసరమైనది. అందరికీ శ్రీ మాత మదర్ మిర్రా జన్మదిన శుభాకాంక్షలు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. ఇంతకుముందు ప్రవచనంలో ప్రేమధ్యానము అందరినీ చెయ్యమని మాస్టారు ఆదేశించారు, కాబట్టి ఈ ధ్యానాన్ని ఈ సిరీస్ లో అందించటం జరిగింది.

52 .గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

ప్రతి పదము పదార్ధముగా మారే ప్రోసెస్ లొ 14 స్థాయిలు ఉంటాయి, అవే 14 మన్వంతరాలు. సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న కోణములే ఈ సృష్టికి మూలము. అమావస్య నుండి పౌర్ణమికి మధ్యలో 14 తిధులు అంటే 14 రోజులు అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య ఉండే ఒక్కో కోణము ఒక్కో మన్వంతరము, ఒక్కో భువనము. 14 భువనముల యొక్క సృష్టి యొక్క తలాలు ఎన్ని విధాలుగా రూపొందుతున్నాయి అనే అవగాహన కలిగిన మానవ జాతి అతి త్వరలో రానున్నది. భారతజాతిలోని ఈ గురువులకు మాత్రమే ఈ జ్ఞానం ఉన్నది. ప్రతి గురువు రోగనివారణా సామర్ధ్యాన్ని కలిగినవారు, రోగరహిత జీవన విధానం రావాలంటే ఈ గురుచేతనత్వ విజ్ఞానాన్ని మీరు ఆచరణలోకి తెచ్చుకుని అందరికీ అందించండి. గురువులతో ఋణానుబంధం పెంచుకోవటం ఎలా ? 2000 లోపు చెప్పే ఈ అద్భుతమైన అధ్యాత్మిక జ్ఞానం ఇప్పటిదాక భూమి మీద చెప్పబడలేదు. 5000 సంవత్సరాలుగా గురువులు ఈ సమయంకోసం పని చెస్తున్నారు, గురుదేవులు 21వ శతాభ్ధి ఉజ్వల భవిష్యత్తు అని చెప్పారు. ఆ భవిష్యత్తులో మనం ఉండాలి అంటే మనకి ఆ గురువుతో ఋణానుబంధం ఉండాలి.

53 .గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

2000లోపు మాస్టారు ఇచ్చిన ఈ ప్రవచనములలో ఎంతో జ్ఞానం, అధ్యాత్మిక సాధనలతోపాటు 2000 నుండి రాబోయే ఉజ్వలభవిష్యత్తును గురుంచి బాగా ఉత్సాహవంతముగా చెప్పేవారు. ఆ కాలంలో 2000 సంవత్సరం రాగానే అద్భుతమైన మార్పులు భౌతికంగా కనిపిస్తాయి అని ఎంతో మంది ఎదురుకూడా చూసారు. ఇక్కడ అతి ముఖ్య విషయం ఏమిటి అంటె అసలు 2000 సంవత్సరాన్ని ఉజ్వల భవిష్యత్తు అని గురుదేవులు, మాస్టారు ఎందుకు అన్నారు ? ఆది తలమునుండి "ఆత్మ" తన పరిణామక్రమంలో మొదటగా క్రిందికి దిగుతూ అతి నీచమైన (అంటె ఇంక అంతకంటే క్రిందికి వెళ్ళలేని స్ధితి) అంటే భౌతిక తలలంలోని చరమ బిందువును చేరటం అనేది 1999 డిసెంబరునాటికి పూర్తి అయ్యింది. 2000 నుండి దాని పయనం పరిణామక్రమములో ఉన్నతమార్గం వైపుకే ( దాని ప్రయాణం తిరిగి "ఆది" తలం వైపుకే). అందుకే ఆ సమయంలో అధ్యాత్మిక జ్ఞానాన్ని విరివిగా అందచేసి, రాత్రింబగళ్ళు సాధనలు చేయించారు. ఆకాశతత్వం యొక్క రెండు నియమాలు అనుగ్రహం, శరణాగతి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందించిన అనుగ్రహమాలామంత్రము, దత్తశరణాగతి మంత్రములను కోట్ల సంఖ్యలో చేయించి అంతరిక్షములో నిక్షిప్తం చేసారు. అదృశ్యంగా ఉన్నదానిని దృశ్యమానజగత్తులోకి దించే ప్రక్రియ యజ్ఞము. ఎవరి శరీరాలు ఈ తరంగాలకు అనుకూలంగా ఉంటాయో వారిలోకి ఈ శక్తి ప్రవేశిస్తుంది. 2000 తరువాత పుట్టగొడుగుల్లాగా ఎన్నో అధ్యాత్మిక సంస్థలు, గురువులు, వాటిని తక్షణమే అందరికీ చేర్చగల టెక్నాలజీ వచ్చేసాయి, ఇదే ఉజ్వల భవిష్యత్తుకు నాంది, దీనికొరకు భారతీయ గురుపంపర పనిచేసింది. 24కోట్ల సంవత్సరాల తరువాత వచ్చిన అపూర్వమైన మార్పులు ఇవి. మానవీయ ఆత్మ పైవైపుకు వెళ్ళటానికి సామూహికముగా దీక్ష తీసుకుంది. ఈ అమూల్యమైన సమయాన్ని గురించి ఇంత వివరంగా మనకి చెప్పి, పరిణామక్రమములో అతి ముఖ్య సమయాలలో చెయ్యవలసిన సాధనలను మనతో చేయించిన మాస్టారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ? అందరికీ మెహెర్ బాబాగారి 128వ జన్మదిన శుభాకాంక్షలు.

54.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

చంద్రవిద్య : సూక్ష్మ జగత్తులోకి ప్రవేశీంచటమే చంద్రవిద్య. దీనిలో ప్రవేశించటానికి నామ రూప రహిత స్ధితి, శబ్ధాతీత స్ధితి, దిగంబర స్ధితి కావాలి, సమర్ధ సద్గురు ధ్యానం వలన ఈ స్ధితిలోకి ప్రవేశించవచ్చు. శివుడు దిక్కులే అంబరముగా కలిగినవాడు, భూతనాధుడు, స్మశానంలో ఉంటాడు, విభూతి అనగా చితా భస్మాన్ని పూసుకుని ఉంటాడు. మెడలో పాములు, తలమీదనుండి గంగ ప్రవహిస్తుంది, ఇది ఆయన రూపం. శివుని రూపం చంద్రవిద్యారూపానికి ప్రతిరూపం. శివుని తత్వం అర్ధం అయితే చంద్రవిద్య అర్ధం అవుతుంది. "చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమ: ". ఆహారము తీస్కొనేటప్పుడు మనం వేసే యంత్రము సూర్యునియొక్క 7 కిరణాలను మన ఆహారంలోకి తీస్కొనివస్తాయి. అచ్యుతానంత గోవింద మంత్రమువల్ల అన్ని రోగాలు నయం అవుతాయి. భూతనాధులు అవ్వాలంటె నేను చెప్పిన విధంగా ఆహారం తీస్కోవాలి, పంచ ప్రాణాలకు ఆహుతులు వెయ్యాలి. సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానం వలన దిగంబరత్వాన్ని పొందవచ్చు. భగవంతుని యొక్క మహిమ " విభూతి" అదే ఐశ్వర్యం. ఇది అర్ధం అయితే శివుని వలె మీరు చితాభస్మధారులే. మన ఆలోచనలు, శబ్ధములు, మన కర్మ, మన అంత:కరణ, మన భావాలు సూక్ష్మజగత్తులోకి ప్రవేశించాలి అనే భావనతో విభూతి ధరించాలి.

55.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

యోగవిద్యలో " నువ్వు " ఉండకూడదు, లోపల ఉన్న చేతనత్వాన్ని పనిచెయ్యనివ్వాలి. ఈనాటి ఈ చదువులకు ప్రాధన్యతనివ్వకుండా యోగవిద్యకు ప్రాధాన్యతనిచ్చినప్పుడే భారతదేశం తిరిగి జగద్గురుపీఠం అధిరోహిస్తుంది. సర్వజ్ఞత్వంలో ఉంటే ధ్యానం, లేకపోతే నిద్ర. సూర్యకిరణములు ఘనీభవించిన రూపాలే గురువుల యొక్క శరీరాలు, వాళ్ళు ప్రజ్ఞానఘనులు. మాస్టర్స్ డిగ్రీ ద్వారా గురువులచేతనత్వం మీకు అర్ధం అవుతుంది. మీరు వారి స్థాయికి పూర్తిగా చేరుకోలేకపోయినా వాళ్ళ జీవిత విధానం, ఫలానా పరిస్ధితికి ఫలానా గురువు ఎలా స్పందిస్తారు అనేది మీకు అర్ధం అయితే మీరు చాలా సాధించినట్లే. గురువుల శరీరాలే కాదు, వాళ్ళ ఫొటోలు కూడా ఘనీభవించిన సూర్యకిరణాలే, వాళ్ళ రూపాన్ని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, గురురూపాన్ని మీరు మీ స్మృతిపధంలో ఉంచుకోగలిగితే మీరు కూడ వారి స్ధితిలో ఉన్నట్లే. ఆ గురురూపాన్ని మీ మనస్సులో ఉంచుకోవటంవల్లే మీరు వారి స్థాయికి చేరగలుగుతారు.

56.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

భారతీయులు అంటే మృత్యువుని గెలిచినవాళ్ళు, అమరులు, అమృతపుత్రులు. "ఋచొ అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు: యస్తన్నవేదా కిం ఋచా కరిష్యతి, య యేతత్తద్ విదుస్త ఇమే సమాసతే." ఋగ్ వేద I.164.39 . సంకల్పం చెప్పుకునేప్పుడు మనం " శ్రీ మహా విష్ణురాజ్ఞయ: " అని ఆ విష్ణువు ఆజ్ఞద్వారా చేస్తున్నాను అని చెప్పుకుని చేస్తాం. ఆ కాల ప్రవాహం అర్ధం చేస్కుని, లక్ష్యాన్ని అర్ధం చేస్కుని జీవించకపోవటం వల్ల ఇప్పుడు అందరికీ కష్టాలు. కాలాన్ని సద్వినియోగం చేస్కుంటూ, కాలానికి అనుగుణంగా జీవించటం నేర్చుకోవాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వలన ఆ మౌనంలోకి ప్రవేశిస్తే మీరు ఆ మహాకాల చక్రవర్తీ సామ్రాజ్యంలో పౌరులుగా మారతారు, ఆ మహాకాల చక్రవర్తీ యంత్రం పెట్టుకోవటానికి అర్ధం అది. అనంత జ్ఞానం, అనంత సంపదలు ఈ ధ్యానం వలన లభిస్తాయి. ఈ అద్భుతమైన ధ్యాన మార్గంలో మీకు ఈ సంపదలు అన్నీ వస్తాయి అని పతంజలి ఋషి గ్యారెంటీ ఇస్తున్నారు. అనన్యచింత చేసినవాళ్ళని నేను చూస్కుంటాను అని స్వయంగా జగత్ గురు శ్రీ కృష్ణులవారే చెప్పారు కదా! భూమి తన భవితవ్యతకొరకు, తన లక్ష్యంకొరకు సూర్యునిచుట్టూ తిరిగుతోంది. 2000 సంవత్సరం తరువాత తన లక్ష్యానికి అనుగుణంగా లేనివారిని తనమీద జీవించనివ్వదు. ఆ పృధ్వియొక్క పరిణామ క్రమంలో ఏ రామ రాజ్యాన్ని గురుంచి స్వర్గీయమైన వర్ణన మనం వింటామో ఆ పరిస్ధితులు భూమిమీద ఉండటం అవసరం, అందరిలోనూ ఆత్మరాజ్యస్థాపన జరగాలి. భూమిపై స్వర్గావతరణ, వేద సంస్కృతి పునర్జాగరణ, అందరికీ శాంతి, సుఖము, సమృధ్ధి అనేది మన లక్ష్యం కావాలి.

57.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

దత్తాత్రేయ తత్వం, కృష్ణ తత్వం, వేంకటేశ్వర స్వామి తత్వములు ఏమిటి ? నియంత్రితమైన మనస్సుగలవారిని "యతి" అంటే నియతికలిగినవారు అని అర్ధం. యతీనాం బ్రహ్మా భవతి సారధి యొక్క నిర్వచనాన్ని వివరించారు. ఆత్మ సూర్యుడు అంటె అనాహతచక్రంలో ఉండేవాడు, సిరీస్ సూర్యుడు అనగా ఆజ్ఞా చక్రంలో ఉండేవాడు. దత్తుడు "స్మరణ మాత్రేణ సంతుష్టా", స్మరించినంత మాత్రంగానే సంతుష్టి చెందుతాడు. యోగమాయా శక్తి దత్తుడిది, భక్తి శక్తి కృష్ణుడిది ఇవి రెండూ ఒకే నాణానికి ఉన్న రెండుపక్కలు. యోగమాయా శక్తి, సిరీస్ నక్షత్రం నుండి వచ్చే 14 భువనాలలో వ్యాపించిన యోగ శక్తి, దాని కేంద్రము "ఓం". ఆజ్ఞాచక్రానికి, సహస్రారచక్రానికి మధ్యలో ఒక బిందువు వున్నది, అక్కడ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము మూడు ఏకీకృతమవుతాయి, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో చివరికి మన దృష్టిని ఈ బిందివువద్ద ఉంచుతాం. ఈ ధ్యానముగురించి సమర్థ సద్గురు శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవులు అందించిన అనేక ప్రవచానాలలో అతి ముఖ్యమైనది ఈ ప్రవచనం.

58.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

గురువులు భారతీయ గురు పరంపరలో ధర్మాన్ని పటిష్టమైన, క్రమమైన పధ్ధతిలో అందించారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు వీటికి నాంది. గురువులు ధర్మాన్ని అపౌరుషేయంగా గుర్తించినవారు. ఆ ధర్మాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక విశేషమైన నక్షత్రం నుండి మనకు అనవరతంగా కొన్ని సందేశాలు లభిస్తాయి. ధర్మం ఇంత పటిష్ఠంగా ఉండటానికి కారణం ఈ నక్షత్రమే. నియామకం చేసే శక్తి ఈ నక్షత్రానికి ఉంది, ఇది గురుపరంపరకు మూల స్థానం. దీనిని భారతీయులుగా మనం ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఉన్నది. యదా యదాహి ధర్మశ్య, గ్లానిర్భవతి భారత - " భారత" అంటె వెలుగుపై మక్కువ కలిగినవారు అని, ఈ ప్రామిస్ వెలుగుపై మక్కువ కలిగినవారికే, అందరికీ కాదు. వెలుగు నిరంతరం సూర్యునిద్వారా భూమిమీద ఉన్నవారికి లభిస్తూనే ఉంది. సూర్యుడి వెనకాల సప్తఋషులు, వారి వెనకాల ధృవ నక్షత్రం, ఆ పైన ఉన్న సీరియస్ అను నక్షత్ర కేంద్రం నుండి భూమి పై ఎప్పుడు ఎప్పుడు ధర్మగ్లాని జరిగిందో అప్పుడప్పుడు ధర్మం ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరం నుండి ఆ ధర్మం పున: ప్రతిష్ఠించబడుతోంది. మూడు రకాలైన లక్షణాలు మనం అలవరచుకోవాలి : 1. సమయ సద్వినియోగం, 2. వనరుల సద్వినియోగం & 3. విశ్వపణాళికను అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా జీవించటం. క్లీం - కాలాన్ని, దూరాన్ని సద్వినియోగం చేస్కోవటం, శ్రీం - వనరులను సద్వినియోగం చేసుకొవటం & హ్రీం - విశ్వప్రణాళికకొరకు జీవించటం.

59.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

సమర్థ సద్గురు ధ్యానం : "ఓం" అన్ని భాషలకు మూలం, అన్ని విజ్ఞానాలకి, జ్ఞానానికి మూలం అదే. మనకి కూడా ఏదన్నా సమస్య వస్తే ఆలోచిస్తాం. "ఆలోచన" అంటే దర్శనం, మౌనంగా ఉండి గమనిస్తాం. " అభ్యుధ్ధానం అధర్మశ్య - తదాత్మానం సృజామ్యహం" ఆత్మనుండి ఆ శక్తి ఉద్భవిస్తుంది.భూమి స్వర్గం రావాలి అంటే వేద విజ్ఞానం వచ్చి తీరాలి. ఆ వేద విజ్ఞానము ఎప్పుడెప్పుడు భూమి మీద నీటిలో , అంటే కామమయతలము, అనగా కోరికలలో మునిగిపోయిందో అప్పుడప్పుడు "యజ్ఞ వరాహ నరసింహ స్వామి" దానిని పైకి లేపారు. వేద విజ్ఞానం మంచిది అని మనం నమ్మితే మన జీవితం వేదమయం కావాలి.మహాకాల చక్రవర్తీ యంత్ర పట్టాభిషేకం జరిగిపోయింది, ఆయన రాజ్యంలోని వ్యక్తులవలె మీరు జీవించాలి. 21 వ ఓంకారం తరువాత వచ్చే మౌనంలో విలీనం అవ్వాలి. నీ మనస్సు "డిసెంట్ ఆఫ్ ద పవర్" మీద ఉంచుకో అన్నాడు శ్రీ అరబిందో, సి.వి.వి అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. అజ్ఞాచక్రం, సహస్రారం మధ్యలో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవాలి, సమస్త జ్ఞానము అంతరిక్షంనుండి అక్కడే దిగుతుంది. సమర్ధ సద్గురు స్పర్శ లోని - పూర్వేషామపి గురు: వివరణ ఈ ప్రవచనంలో వివరించారు.

60 .గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

స్వ ఆత్మరాజ్యస్థాపన : ఆ శాంతి యొక్క సారధ్యంలో "యోగస్థ: కురు కర్మాణి" యోగ స్ధితిలో ఉంటూ మనం జీవించటం నేర్చుకోవాలి. అన్ని విద్యలూ ఏ శాంత స్ధితి నుండి ఆవిర్భవిస్తున్నాయో ఆ శాంత స్ధితిలోకి మనం సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా ప్రవేశించాలి. ఒక దేశంలో రాజు యొక్క శాసనాలను మంత్రలు ఎలా అందరికీ అందిస్తారో అలా ప్రకృతిలోని 7 గ్రహాలు ఆత్మరాజ్యంలోని మంత్రలు. ఆ ఏడుగురు ద్వారా ప్రకృతిలోని శక్తులు మన శరీరములోని 7 కేంద్రములలోకి, , మన డి.ఎనె.లోకి, అణువులు పరమాణువులలోకి , పిండాడము మొదలుకొని బ్రహ్మాండంలోకి సంప్రేక్షణ అనగా ట్రాన్స్మిట్ చెయ్యబడతాయి. ప్రకృతి ఒక చక్రీయ క్రమంలో పని చేస్తుంది, ఒక నియమిత చక్రములో వర్తిస్తుంది, అనగా తిరుగుతుంది " చక్రవర్తిత్వము". మన శరీరములో 7 శక్తి కేంద్రాలలో జరిగే చక్రీయక్రమానికి అనుగుణంగా మనం జీవించాలి. సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా మనలో ఆత్మరాజ్యస్థాపనని చేసుకుని, అందరినీ ఇందులో భాగస్వాములను చెయ్యాలి.

61.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

"గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర " అను శ్లోకంలోనే "సార్వజ్ఞ బీజానికి " సంబంధించిన జ్ఞానం ఉన్నది. మౌనంలో మీ ప్రతి సమస్యకు కావలసిన సమాధానం దొరుకుతుంది. 2000 నుండి నూతన యుగావతరణ జరుగుతుంది, దీనికోసం ఆధ్యాత్మిక జ్ఞానంతో మిమ్మల్ని మీరు సంస్కరించుకోకపోతే ఏ గురువు మీకు సహాయం చెయ్యలేడు. మీరు ఆహారం తీస్కున్న తరువాత వజ్రాసనంలో కూర్చుని " నమస్కారం మాస్టర్ సి.వి.వి. టు యువర్ లోటస్ ఫీట్" అని "నేను తీస్కున్న ఈ ఆహారం ప్రపంచంలో ఎవరెవరు ఆకలితో ఉన్నారో వారికి చెందుగాక " అని 5 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే సాధన. ఈ ప్రవచనం అక్టోబర్ లో అష్టమినాడు ఇచ్చినప్పటికీ నవంబర్ నుండి ఇస్తున్న గురుచేతనత్వం సిరీస్ లో ఈ ప్రవచనాన్ని కలపటానికి కారణం ఇందులో ఉన్న సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానికి సంబంధించిన ముఖ్య సూచనలు .

62.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

పరిణామ క్రమములో మానవునికి మాత్రమే అతి ఉచ్చమైన చేతనత్వ స్థాయిని అందుకోగలిగిన శక్తి ఇవ్వబడింది. గురు బ్రహ్మ అని మనం ఉచ్చరిస్తున్నప్పుడు శాంత స్ధితిలో మనల్ని మనం లయం చేసుకోవాలి. అనంత శాంత స్ధితినుండి, నిశ్శభ్ధమునుండి శబ్ధములు ఉధ్భవిస్తాయి. శబ్ధములను మంత్రములని, నిశ్శబ్ధ స్ధితిని బ్రాహ్మణాలని వేద విజ్ఞానం చెపుతుంది. ఒక శబ్ధం లయం అయ్యి వేరొక శబ్ధం ఉత్పత్తి అవ్వటానికి మధ్య ఉన్న సంధికాలాన్ని పట్టుకోవాలి. సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానములో 21 ఓంకారలను ఉచ్చారణ చేస్తాం. ఓంకారం అత్యంత శక్తివంతమైనది, ఆ శక్తిని అర్ధం చేసుకుని ఉపయోగించుకోవటం చాలా అవసరం, ఆ శక్తిని ఉపయోగించుకోవటం రాకపోవటం వలన ఓంకార ఉచ్చారణకు కొన్ని అవధులు ఏర్పడ్డాయి.

63.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

కాలము యొక్క వృత్తాన్ని, చక్రాన్ని అర్ధం చేసుకోవాలి. మహాకాల యంత్రమును ఉపయోగించుకోవాలంటె మీకు కాలమునకు, పదమునకు, పదార్ధమునకు ఉన్న సంబంధము తెలియాలి. కొంతమందికి ఏదన్నా చెప్తే వాళ్ళకి అది వెంటనే జరుగుతుంది, కొంతమందికి జరగదు. దానికి కారణం వాళ్ళ శరీరములోని ద్వాదశ రాశులయొక్క, వాళ్ళు ఉన్న ఊళ్ళోని ద్వాదశరాశులయొక్క అనుకూలతే. హనుమంతులవారు పంచమహాభూతాలను ఎలా వాడారో వివరించారు, అందుకని హనుమత్ ఉపాసన అంటే పంచభూతాలను ఉపాసించినట్లే. గణపతి పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని చాలా తేలికగా అర్ధం చేస్కొని ఆచరించారు, తన తల్లితండ్రులకు ప్రదక్షిణ చేసి ప్రపంచానికి ప్రదక్షిణ చెయ్యటం అంటె అదే. మహాకాల చక్రవర్తీ సామ్రాజ్యంలోని పౌరులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడే మరో అమూల్యమైన ప్రవచనం మన అందరికీ మాస్టారు ఇచ్చిన అనుగ్రహం ఈ అమృతధార.

64.గురుచేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ

Synthesis of Consciousness "A Procedural Approach to Samardha Sadguru Sparsha Meditation ". Every route is destined to reach a specific place, every meditation has got its own goal. Master R K through this Samardha Sadguru Sparsha Meditation designed a plain sailing form of meditation to achieve “Samyamana” illustrated in Patanjali yoga sutras. “Tatramekatra samyamaha” which means experiencing all the three states of Dharana (concentrating), Dhyana (meditating) and Samadhi (a state of total equilibrium of a detached intellect) simultaneously. This is the process of Samyamana. Just as a mathematical problem can be solved by applying a suitable formula to get the correct result, practicing this meditation can result in the consciousness expansion.Evolutionary progress should lead a person to the level of Purushotthama. S S S Meditation is really the underlying principle of all forms of meditations. It helps us travel into the cosmic plane from this physical plane to reach the MahaSoonya. Practice this meditation without any preconceived notions to associate yourselves with the Ultimate Consciousness!!